గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకే గాజు గ్లాసు కేటాయించబడింది. మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఇలా ఎలా జరిగింది.? అని తొలుత జనసేన శ్రేణులు ఆందోళన చెందాయి. ఆ తర్వాత అసలు ఆందోళన, టీడీపీ అలాగే బీజేపీ అభ్యర్థుల్లో షురూ అయ్యింది. వాస్తవానికి, ఈ గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అంశం పట్ల జనసేన పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనసేన అభ్యర్థులకు అసలు సమస్యే లేదు గనుక.
కానీ, కూటమి అభ్యర్థులు కొంత నష్టపోవచ్చు. పొత్తు ధర్మం పాటించాలి గనుక, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో గాజు గ్లాసుని ప్రమోట్ చేస్తూ, జనసేన పోటీ చేయని స్థానాల్లో ‘గాజు గ్లాసు మాది కాదు’ అన్న దిశగా ప్రచారం చేయాల్సి వుంటుంది జనసేన శ్రేణులు. ఇది కష్టతరమైన వ్యవహారమే.
ఎందుకంటే, కూటమిలో సైకిలు, కమలం, గ్లాసు.. ఈ మూడు గుర్తులున్న లోగోలతోనే ప్రచారం ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. సో, వున్నపళంగా టీడీపీ – బీజేపీ.. ఈ గాజు గ్లాసు విషయమై ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ప్రధానంగా రెబల్ అభ్యర్థులకు గాజు గ్లాసు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు దక్కితే, టీడీపీ రెబల్ అభ్యర్థికి ఓ చోట గాజు గ్లాసు ఎన్నికల సింబల్గా దక్కడం గమనార్హం. తెలంగాణలో సినీ నటి సాహితి దాసరి (స్వతంత్ర అభ్యర్థి.. లోక్ సభ)కి గాజు గ్లాసు దక్కింది. ఈమెపై గతంలో ట్రోలింగ్ జనసేన శ్రేణుల నుంచి జరిగింది.
జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో మంచి విజయం దక్కితే, శాశ్వతంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి గాజు గ్లాసు అనేది కామన్ సింబల్గా వుండిపోతుంది. అప్పుడిక ఈ ఫ్రీ సింబల్ కష్టాలు వుండవు.