వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా ఆయన వైసీపీకి దూరంగా వుంటున్నారు. వైసీపీ ఆయన్ని అధికారికంగా వదిలించుకోలేకపోయింది.
టీడీపీ దగ్గరగా, బీజేపీకి దగ్గరగా, జనసేన పార్టీకీ దగ్గరగా వుంటూ వచ్చిన రఘురామ కృష్ణరాజు, ఈ మూడిటిలో ఏదో ఒక పార్టీ నుంచి నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో వుంటారన్న ప్రచారం జరిగింది. ఆయనా ఇదే ధీమా వ్యక్తం చేశారు కూడా.
‘ఏదో ఒక పార్టీ నుంచి బరిలో వుంటా.. ఏ పార్టీ అన్నది ముందు ముందు చెబుతా. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిని నేనే..’ అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, రఘురామకి ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచీ టిక్కెట్ దొరకలేదు. జనసేనతో ఆయనెప్పుడూ లేరు. కానీ, టీడీపీతో దగ్గరగా వున్నారు. బీజేపీతో ఇంకా దగ్గరగా వున్నారు.
బీజేపీ నుంచే రఘురామకి టిక్కెట్ దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఎందుకిలా.? వైఎస్ జగన్ వల్లే తనకు నర్సాపురం లోక్ సభ టిక్కెట్ దక్కలేదంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. బీజేపీ పెద్దలతో రఘురామకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ, ఆయన ఆ సంబంధాల్ని బలోపేతం చేసుకోలేకపోయారు. అదే అసలు సమస్య.
సీఎం రమేష్కి సీటు దక్కినప్పుడు, రఘురామకి ఎందుకు సీటు దక్కలేదు.? ఇక్కడే రఘురామ డొల్లతనం బయటపడిపోయింది. రఘురామ డబుల్ గేమ్ కాదు, ట్రిపుల్ గేమ్ ఆడటాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుందన్నది ఓ వాదన. అయితే, ఇంకా సమయం వుంది, తనకు టిక్కెట్ దక్కుతుందని రఘురామ నమ్ముతున్నారు. ఆ ఛాన్సే లేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.
రెంటికీ చెడ్డ రేవడి అనుకోవాలా.? ఇంకేమైనా అనుకోవాలా.? జనసేనతో రఘురామ కలిసి ప్రయాణం చేసినా, ఆయనకు నర్సాపురం టిక్కెట్ దొరికి వుండేదేమో.! ఇప్పుడైతే ఆ ఛాన్స్ కూడా ఆయనకు లేకుండా పోయింది.