కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.!
‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే విమర్శ చాలాకాలంగా చంద్రబాబు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే, టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు మీద, వైసీపీ నానా రకాల విమర్శలూ చేస్తోంది. బీజేపీ, జనసేనలో టీడీపీ పట్ల అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది.
అయితే, పొత్తుకి సంబంధించి ఏ చిన్న పొరపచ్చాలు వచ్చినా.. మొత్తంగా కూటమి విఫలమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తెలుసు. అందుకే, అసంతృప్తుల్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారాయన. అయినాగానీ, అక్కడక్కడా అసంతృప్తి గళాలు వినిపిస్తునే వున్నాయి.. అదీ టీడీపీ నుంచి.
తెనాలిలో ఆలపాటి రాజా టీడీపీ మీద తిరుగుబాటు బావుటా వేస్తారని అంతా అనుకున్నారు.. జనసేనకి కేటాయించిన సీటు ఇది. తొలుత కామ్గానే వున్న ఆలపాటి రాజా, అనూహ్యంగా ఎదురు తిరిగారు. అంతలోనే సర్దుకున్నారు.
పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ హంగామాని చూస్తూనే వున్నాం. ఇంకోపక్క, శ్రీకాళహస్తిలో టీడీపీనే పోటీ చేస్తున్నా, స్థానిక జనసేన నేత మీద టీడీపీ శ్రేణులు నానా యాగీ చేస్తున్నాయి. వీటన్నిటినీ చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి కుమ్ములాటలు ఓ కొలిక్కి వస్తున్నాయి.
పిఠాపురంలో లక్ష మెజార్టీ.. అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన దరిమిలా, ఆ లక్ష మెజార్టీ విషయమై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా గతంలోనే హామీ ఇచ్చిన దరిమిలా, మొత్తంగా తన శక్తియుక్తులన్నిటినీ అక్కడే మోహరించి, జనసేనాని పవన్ కళ్యాణ్ని రికార్డు మెజార్టీతో గెలిపించే వ్యూహం చంద్రబాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎలాగూ ఈ నియోజకవర్గం, ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. జనసేన వైపునుంచే లక్ష మెజార్టీ దిశగా వ్యూహ రచన జరుగుతోంది. నిప్పుకి వాయివు తోడైతే.. అన్న చందాన, జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి.. అత్యంత పకడ్బందీగా ఈ నియోజకవర్గంలో వైసీపీని రికార్డు మెజార్టీతో ఓడించడం ఖాయంగానే కనిపిస్తోంది.
కూటమి ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న దరిమిలా, వైసీపీ సహజంగానే ఒకింత అయోమయానికి గురవుతుంది. అదే జరుగుతోంది కూడా. ‘ఏం చేసినా, పిఠాపురం ఈసారి మనకు అనుకూలంగా మారే పరిస్థితి లేదు. ఇక్కడ ఫోకస్ పెట్టి, మిగతా చోట్ల దెబ్బ తినడం మంచిది కాదు..’ అంటూ అధినాయకత్వానికి అప్పుడే, వైసీపీ స్థానిక నేతలు రిపోర్టులు కూడా పంపుతున్నారట.
అయినాగానీ, పవన్ కళ్యాణ్ని ఓడించాల్సిందేననే ఆలోచనతో వున్న వైఎస్ జగన్, మొత్తం ‘పవర్’ అంతటినీ (అంటే, ధనం.. బలగం..’ అక్కడే మోహరించాలనే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.