Airplane: ఇండోనేషియా (Indonesia) లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లూ నిద్రపోవడంతో విమానం గతి తప్పింది. ఆలస్యంగా తేరుకున్న పైలట్ దీనిని గమనించి సరైన మార్గంలో పెట్టి పెద్ద ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రాజధాని జకార్తా పరిధిలో జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళ్తే..
బాటిక్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం 153మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిసి జకార్తాకు పయనమైంది. మార్గమధ్యలో కో-పైలట్ అనుమతితో ప్రధాన పైలట్ నిద్రపోయాడు. అయితే.. కాసేపటికి కో-పైలెట్ కూడా నిద్రపోయాడు. దీంతో విమానం దారి తప్పింది. వీరిని అప్రమత్తం చేసేందుకు జకార్తా విమానాశ్రయ కంట్రోల్ రూమ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయింది.
అరగంట తర్వాత తేరుకున్న ప్రధాన పైలట్.. విమానం సవ్యమైన దిశలో వెళ్లడంలేదని గుర్తించి కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై దారిలోకి తీసుకొచ్చాడు. ఎటువంటి ప్రమాదం జరగకుండా సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఇండోనేషియా రవాణా శాఖ ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసి దర్యాప్తు చేపట్టింది.