వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.. వైఎస్ జగన్, బొత్సకి సూచించారని గతంలో ప్రచారం జరిగింది.
బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న విషయం విదితమే. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద విపరీతమైన నెగెటివిటీ నేపథ్యంలో ఆయన్ని తప్పించి, బొత్స ఝాన్సీని వైఎస్ జగన్ రంగంలోకి దించారు. ఎంవీవీ సత్యనారాయణ అసలు టిక్కెట్ దక్కించుకోలేరని అంతా అనుకున్నారుగానీ, ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ దక్కింది.. దానికోసం ఆయన చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చిందని విశాఖలో జనం చెవులు కొరుక్కుంటున్నారు.
ఎంవీవీ సత్యనారాయణ గెలిచే అవకాశం లేదని వైసీపీ సొంత సర్వేల్లోనే తేలుతోందిట. మరి, బొత్స ఝాన్సీ పరిస్థితేంటి.? అంటే, ఆమెకీ ఓటమి తప్పేలా లేదట. ఆమె గనుక విజయనగరం నుంచే పోటీ చేసి వుంటే, అది ఆమెకీ, వైసీపీకీ అనుకూలంగా వుండేది. అన్నిటికీ మించి, బొత్స సత్యనారాయణకి చాలా చాలా బలంగా వుండేది.
చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి చీపురుపల్లి చాలా బలమైన నియోజకవర్గం బొత్సకి. ఇదే స్థానం నుంచి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ, చివరి నిమిషంలో నిర్ణయాలు మారిపోయాయి.
దాంతో, బొత్స సత్యనారాయణ ఊపిరి పీల్చుకున్నారు. గంటా గనుక చీపురుపల్లిలో పోటీ చేసి వుంటే, తేలిగ్గానే గెలిచేది టీడీపీ. జనసేన నుంచైనా గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించాలని టీడీపీ – జనసేన కలిసి భావించాయి.
కారణాలేవైనా, బొత్సకి ఈ విషయం బాగా కలిసొచ్చింది. ప్రచారం మొదలైంది.. జోరుగా సాగింది, సాగుతూనే వుంది.! ఏమయ్యిందోగానీ, చీపురుపల్లి వైసీపీ శ్రేణుల్లో ‘బొత్స ఓడిపోతారేమో..’ అన్న బయం బయల్దేరింది. కూటమి క్యాండిడేట్ కిమిడి కళా వెంకటరావు, బొత్స కంటే స్ట్రాంగ్ అని అనలేం. కానీ, కిమడి కళా వెంకట్రావుకి అన్నీ కలిసొచ్చేస్తున్నాయిప్పడు.
అనూహ్యంగా బొత్సకి నెగెటివ్ వేవ్ షురూ అయ్యింది చీపురుపల్లిలో. వైసీపీ శ్రేణుల్లో నీరసం ఆవహించేయడంతో బొత్స అనూహ్యంగా వెనుకబడిపోయారు. ఇదంతా కేవలం వైసీపీ సర్కారు మీదున్న వ్యతిరేకతే అనుకుంటే పొరపాటు. అంతకు మించి, బొత్స కుటుంబంపై వ్యతిరేకత.. చీపురుపల్లిలో బొత్స ఓటమికి కారణమయ్యేలా వుంది.
చివరి నిమిషంలో బొత్స మార్క్ ఎలక్షనీరింగ్ ఆయన్ని గెలిపిస్తుందా.? ఆ ఎలక్షనీరింగ్లో కూటమి ఇప్పటికే పక్కా వ్యూహం రచించుకున్న దరిమిలా, బొత్సకి ఓటమి తప్పదా.? వేచి చూడాల్సిందే.
ఇటు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓటమి, అటు ఆయన సతీమణి బొత్స ఝాన్సీ ఓటమి.. ఈ రెండూ గనుక జరిగితే, విజయనగరం జిల్లా రాజకీయాల నుంచి బొత్స కుటుంబం ఈసారి పూర్తిగా ఔట్ అయిపోతుందనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.
బొత్స ఝాన్సీ, విశాఖ నుంచి పోటీ చేయకుండా విజయనగరం నుంచే లోక్ సభకు పోటీ చేసి వుంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని, బొత్స అనుచరులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. స్వయానా బొత్స కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.!
ఎందుకిలా జరిగిందబ్బా.? వైసీపీలో ఎవరు చక్రం తిప్పితే, ఇలాంటి పరిస్థితి బొత్స కుటుంబానికి వచ్చిందబ్బా.? ఇదిప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ అవుతున్న అంశం.