ఎలాగైతేనేం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. బీజేపీ – టీడీపీలను కలపగలిగారు.! 2014 ఎన్నికల నాటి పొలిటికల్ ఈక్వేషన్ మళ్ళీ షురూ అయ్యింది. ఆ కూటమిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతోంది జనసేన పార్టీ.
24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లను ఇప్పటికే పొత్తులో సొంతం చేసుకుంది జనసేన పార్టీ. అందులోంచి, బీజేపీకి ఒక ఎంపీ సీటుని జనసేన త్యాగం చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్న కోణంలోనే ఇరవై నాలుగు అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లకు జనసేన ఒప్పుకుందన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడిక బీజేపీ కోసం త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీనే. ఆరు ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందన్న ప్రచారమైతే జరుగుతోంది. పదిహేను వరకు అసెంబ్లీ సీట్లనూ బీజేపీ కోరుతోందట.!
కానీ, ఏపీలో బీజేపీకి వున్న ఓటు బ్యాంకుని పరిగణనలోకి తీసుకుంటే, ఇదంతా దండగ వ్యవహారమే. కానీ, పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ గొంతెమ్మ కోర్కెల్ని చంద్రబాబు కొంతవరకు మన్నించక తప్పదు. ఇక్కడ అవసరం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిదే.
పొత్తు పెట్టుకున్న మూడు పార్టీలు, కింది స్థాయిలో కలిసి పని చేయాలి. ఒక్క సీటును కూటమి కోల్పోయినా, అది వైసీపీకి అప్పనంగా ఇచ్చేసినట్లే అవుతుందన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వంతో జరిపిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేశారు.
98 పర్సంట్ స్ట్రైక్ రేట్ అనే మాట ఊరికే జనసేనాని అనలేదు. అన్నీ ఆలోచించే ఆయన ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే ప్రకటన చేశారు. ఆ ఆలోచనతోనే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పని చేసేలా చేయగలిగారు. ఇప్పుడిక స్ట్రైక్ రేట్ విషయంలోనూ, బీజేపీ అలాగే టీడీపీ.. జనసేనతో కలిసి పని చేయాల్సి వుంది.
ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారనీ, టీడీపీ – బీజేపీ – జనసేన నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొంటారనీ తెలుస్తోంది. ఆ సభ వేదికగా మోడీ ఇంకాస్త స్పష్టత ఈ కూటమిపై ఇవ్వాల్సి వుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించీ మోడీ స్పష్టత ఇస్తే, 98 శాతం స్ట్రైక్ రేట్ పెద్ద కష్టమేమీ కాదు.!