రాష్ట్రంలో యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని.. సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. వ్యాక్సినేషన్ లో భాగంగా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15-18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తైందన్నారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. ప్రస్తుతానికి పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని అన్నారు. భవిష్యత్తులో కరోనా కేసుల తీవ్రతను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. సంక్రాంతి సెలవులు ముగింపు సందర్భంగా.. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.