భారతీయ జనతా పార్టీ అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకుంది. మహారాష్ట్రలో అధికారం చేపట్టే అవకాశం వచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోవడం.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుందామంటూ శివసేన ‘మెలి’ పెట్టడంతో, బెట్టు చేసిన బీజేపీ.. అధికారాన్ని వదులుకుంది. దాంతో, శివసేనకు బంపర్ ఛాన్స్ దక్కినట్లయ్యింది.
ఎన్సీపీని, కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోయి, అధికార పీఠమెక్కాలని శివసేన భావిస్తోంది. ఎన్సీపీ డిమాండ్ మేరకు శివసేనపార్టీ, కేంద్ర మంత్రి పదవినీ వదులుకోవడం గమనార్హం. శివసేన ఎంపీ అరవింద్ సావంత్, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న విషయం విదితమే. ఆయన ఈ రోజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ, ఇంకా శివసేనకు భరోసా ఇవ్వలేదు. శివసేనకు ఎన్సీపీతోపాటు, కాంగ్రెస్ కూడా మద్దతిస్తేనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ కూడా కన్పించడంలేదనుకోండి.. అది వేరే విషయం.
ఆ మధ్య కర్నాటకలోనూ దాదాపు ఇదే తరహా రాజకీయం నడిచింది. నాటకీయ పరిణామాల మధ్య అక్కడ తొలుత బీజేపీ ప్రభుత్వం ఏర్పడి, రోజుల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కుప్ప కూలింది. ఆ తర్వాత బీజేపీ యేతర ప్రభుత్వం వచ్చింది. అదీ ఎక్కువ కాలం మనుగడ సాధించలేక, చివరికి ఇప్పుడు కర్నాటకలో బీజేపీనే అధికార పీఠంపై కూర్చుంది. అదే పరిస్థితి మహారాష్ట్రలోనూ వస్తుందని బీజేపీ భావిస్తోంది.
అయితే, అధికారాన్ని ముగ్గురం పంచుకుని అయినాసరే, ఐదేళ్ళ పాలన అందించాలని శివసేన, ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ని ఒప్పించే పనిలో బిజీగా వున్నట్లు కన్పిస్తోంది. అంటే, ఐదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు వుంటారన్నమాట.