అతిరథ మహారథులు ఓ వైపు.. అశేష జనం మరోవైపు.. జై జగన్ నినాదాలు ఇంకోవైపు.. ఇవీ ఏపీ రెండో ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించిన దృశ్యాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను.. అని జగన్ అనగానే స్డేడియం హోరెత్తిపోయింది. తొలుత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తర్వాత రహస్య పరిరక్షణ ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేసి వివిధ మతాల ప్రతినిధులు కొత్త ముఖ్యమంత్రి జగన్ ను ఆశీర్వదించారు. తొలుత క్రైస్తవ మత ప్రతినిధులు జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ప్రార్థన చేసి, జగన్ ను ఆశీర్వదించారు. తర్వాత హిందూ మత పెద్దలు జగన్ ను ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు.
అంతకుముందు ఉదయం 11.54 గంటలకు జగన్ కాన్వాయ్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 12.09 గంటలకు స్డేడియం చేరుకుంది. కాన్వాయ్ నుంచి కిందకు దిగిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జగన్ ఓపెన్ టాప్ జీపులో స్టేడియం మొత్తం తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత వేదికపైకి వెళ్లి ఆశీనులయ్యారు. 12.19 గంటలకు గవర్నర్ నరసింహన్ వేదిక వద్దకు రాగా, జగన్ ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత నరసింహన్ జగన్ చేత ప్రమాణం చేయించారు. తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. జగన్ కు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అని స్టాలిన్ తెలుగులో మాట్లాడంతో స్టేడియం కరతాళ ధ్వనులతో మార్మోగింది.
తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. జగన్ కు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ వయసు చిన్నదని, బాధ్యత మాత్రం పెద్దదని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాల ప్రజలు పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా పయనించాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలసి గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు.
తర్వాత కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశారు. మొదటి ఏడాది రూ2,250గా ఉన్న ఫింఛను తర్వాత ఏడాది రూ.2,500, మరుసటి ఏడాది రూ.2,750 ఆ మరుసటి ఏడాది రూ.3000కి పెంచుతానని ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లుగా నెలకు రూ.5వేల వేతనంతో ఈ 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. అవినీతి లేని పాలన అందించడమే తన ధ్యేయం అని జగన్ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేస్తానని స్పష్టంచేశారు.
312843 51709Some genuinely nice stuff on this internet site , I enjoy it. 960432