‘ప్రపంచమంతా ఈ ఏడాది భారత్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వైపే చూస్తోంది’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగానే చెబుతోంది. కానీ దేశం మాత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి బీజేపీ పరోక్షంగా సాయం చేస్తుందన్న చర్చ నడుస్తున్న తరుణంలో అనూహ్యంగా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన లతో జతకట్టింది. అధికార వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయి. ఇలా ఇప్పుడే కాదు ప్రతి ఎన్నికల్లోను ఏదో ఒక అజెండా జనాల దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.
1983 ఎన్నికల సమయంలో ఎన్టీ రామారావు ప్రభంజనం సృష్టించారు. 1984 లో నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు వ్యవహారం హైలెట్ గా నిలిచింది. ఇక 1994 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎన్టీ రామారావు వ్యక్తిగత జీవితాన్ని అజెండాగా తీసుకుని జనాల్లోకి వెళ్లడం అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఓ వ్యక్తి వ్యక్తిగత త జీవితాన్ని ఉద్దేశిస్తూ పదేపదే మాట్లాడటంతో కాంగ్రెస్ కి పరాభవం తప్పలేదు అది వేరే విషయం. ఇక 2004 లో విద్యుత్ ఒప్పందాలకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలని ప్రజల్లోకి తీసుకెళ్లి కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2014 లో ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలు ఎన్నికలను ఊపేశాయి. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరమీదకి వచ్చింది. ఇచ్చిన హామీలేవి తెలుగుదేశం నిలబెట్టుకోలేదని ప్రజలు వైఎస్సార్సీపీకి అధికారాన్ని కట్టబెట్టారు.
2024 ఎన్నికల్లో మాత్రం ‘మద్యపానం’ అంశం ప్రధాన భూమిక పోషించబోతోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని 2019 ఎన్నికల సమయంలో నొక్కి వక్కాణించిన వైఎస్ఆర్సిపి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది.మద్యం రేట్లు పెంచితే జనాలు తాగడం మానేస్తారనే విచిత్ర వాదనతో మద్యం ధరలను అమాంతం పెంచేసింది. అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న బార్లను మూయించేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. కొత్త కొత్త బ్రాండ్లని పరిచయం చేసింది. దాని ద్వారా రూ.వేలకోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో పడింది. మరోవైపు ఈసారి ఎన్నికల హామీల్లో భాగంగా రూ.50కే మద్యం అందిస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. మరి ఓటర్లు మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పిన వైసీపీ గట్టున నిలుస్తారో.. అత్యంత తక్కువ ధరలకే మద్యాన్ని అమ్ముతామని చెబుతున్న టీడీపీ గట్టుకు వస్తారో మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.