ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ల పైనే ఉంది. చార్జ్ తీసుకున్నప్పటినుంచి అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వీరిద్దరిని చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు అధికార పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి.
తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా వైసిపి శ్రేణులు మెప్మా ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని అడ్డుకున్న టిడిపి నేతలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వారిపై డ్రగ్స్ చల్లి చిత్ర హింసలు పెట్టారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వివాదానికి దారితీసింది. వైసిపి నేతలపై నామ మాత్రపు కేసులు పెట్టి.. టిడిపి నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ఎన్నికల సమయంలో పోలీసుల తీరు ఇలాగే ఉంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూటమి పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇక గత నెల 16న ఎన్నికల కోడ్ రావడంతోనే అందరి దృష్టి గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తే వాలంటీర్లపైనే పడింది. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించుకున్న వారు కాబట్టి ఎన్నికల కోడ్ సమయంలో వారు పనిచేయడానికి వీల్లేదని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించింది. ఏప్రిల్ నెలకి సంబంధించి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లోనూ వారిని భాగస్వాములను చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ తంతును ప్రభుత్వం నడిపించింది.
అయితే ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీల నేతలు కోరినప్పటికీ వారి అభ్యర్థనను సీఎస్ పక్కన పెట్టారు. వారికి ఎన్నికల విధులు ఉన్నందున ప్రజలే సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం పెద్ద కష్టమేమి కాదని అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా ప్రతిపక్ష నేతలు సీఎస్ కి వివరించారు. అయితే, ఇంటికి పెన్షన్ తెచ్చి ఇవ్వాలంటే మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్న సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. వీటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
బదిలీ వేటు పడే అధికారుల్లో బలంగా వినిపిస్తున్న మరో పేరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు. 2022లో చార్జ్ తీసుకున్న ఈయన.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఈయనపై బలంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారని ఇప్పటికి పలువురు ఆరోపిస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ముగ్గురి వివాదంపై స్పందించారు. వీరిపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన రిపోర్టులను కూడా అందించామని, సీఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో వీరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.