రాష్ట్రంలో అమలులో ఉన్న వాలంటీరు వ్యవస్థలో ఉన్న లోపాలపై టీడీపీ మాట్లాడుతుంటే, దానికి టీడీపీ వ్యతిరేకమన్నట్లుగా విమర్శిస్తున్నారని నక్క ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సొంత పత్రికలో వాలంటీరీ వ్యవస్థకి టీడీపీ వ్యతిరేకం అన్నట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను బలోపేతం చేసి, ఆ వ్యవస్థల్నీ బలోపేతం చేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేయాలని టీడీపీ ఆకాంశిస్తుందని ఆయన తెలిపారు. వాలంటీర్లలో 95% తమ పార్టీ వాళ్లే అని వైసీపీ నాయకులైన విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు బహిరంగంగానే వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ సభలకి జనాన్ని తరలించడానికి వాలంటీరులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. దీనితో పాటు వీరిలో కొంత మంది ద్వారా అన్యాయాలను, అక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లలోనే కొందరు అసాంఘిక శక్తులుగా మారి మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారని వివరించారు.
వాలంటీర్లు చేసిన సర్వేలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆధారాలతో సహా ఈ వివరాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రజల వ్యక్తిగత విషయాలను సేకరించి జగన్ ఎన్నికలకు ఉపయోగపడేలా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వాలంటీరు వ్యవస్థని అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకులు చేస్తున్న హవాలా ఉదంతాలు గతంలో వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాలంటీరు సేవకుడా లేక ఉద్యోగస్థుడా అని తేల్చాల్సిన బాధ్యత జగన్ మీదే ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే గౌరవ వేతనం సరిపోక కొంత మంది వాలంటీరులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థని సంపూర్ణంగా తీర్చిదిద్ది ప్రజలకి సేవలు అందించే విధంగా నిర్ణయాలను తీసుకుంటామని వివరించారు.