సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై మొదటి నుంచీ విపక్షాలు విమర్శలు చేస్తూనే వున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. డీజీపీతోపాటు, సీఎస్ మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులు అందుకుంది.
ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం, తాజాగా డీజీపీ బదిలీ నిర్ణయం తీసుకోవడంతో, వైసీపీ శ్రేణులు షాక్కి గురయ్యాయి. రాష్ట్ర డీజీపీ అనే గుర్తింపు కాకుండా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడైన అనుచరుడన్న గుర్తింపు రాజేంద్రనాథ్ రెడ్డికి వుందన్నది బహిరంగ రహస్యం.
శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఏదన్నా అంశం మీద, రాష్ట్ర డీజీపీని కలవాలని విపక్షాలు అనుకుంటే, అందుకు రాజేంద్ర నాథ్ రెడ్డి అస్సలు అవకాశమే ఇవ్వరన్న విమర్శ వుంది. అదే సమయంలో, ఏదన్నా ఘటన జరిగితే బాధితుల మీదన కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో వుందన్నదీ ప్రధానమైన విమర్శే.
విపక్ష నేతల అరెస్టుల విషయంలో పోలీసు శాఖకు గడచిన ఐదేళ్ళలో చాలాసార్లు మొట్టికాయలు పడ్డాయి. పోలీస్ బాస్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చాక ఈ మొట్టికాయలు మరింత ఎక్కువయ్యాయి కూడా. సీఐడీ వంటి దర్యాప్తు సంస్థల్ని వైసీపీకి అనుకూలంగా వాడేశారన్న విమర్శల సంగతి సరే సరి.
డీజీపీ మార్పు వెనుక, కేంద్ర ఎన్నికల సంఘానికి బలమైన ఫిర్యాదులే అందాయనీ, వాటిల్లోని వాస్తవాలు గుర్తించి ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ, సీఎస్ మార్పు సంగతేంటి.? రేపో మాపో ఆ ముచ్చటా తీరిపోద్దనే ప్రచారమైతే జరుగుతోంది.
వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా, రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటే, ఆ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తోన్న వ్యక్తుల వల్లనేనన్నది నిర్వివాదాంశం. డీజీపీ మార్పుతో ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతుందా.? అంటే, ఔనని ఖచ్చితంగా చెప్పలేంగానీ, కొంత మార్పు అయితే వుండొచ్చు.
సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందర ఈ మార్పు వల్ల ఎంత ఉపయోగం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.