టీడీపీ నుంచి బీజేపీలోకి ఇటీవలే దూకిన మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు షాకిచ్చారు. ‘ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నేతలు వస్తే బీజేపీ బలపడదు.. వారి రాజకీయ భవిష్యత్తు కోసమే బీజేపీలోకి వస్తున్నారు..’ అంటూ పరోక్షంగా సుజనా చౌదరిపై సెటైర్లు వేశారు జీవీఎల్.
నిజానికి, రాజ్యసభలో బలం కోసం నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ ‘లాక్కుంది’. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. లేకపోతే, సుజనా చౌదరి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీని వీడారన్నది ఓపెన్ సీక్రెట్.
బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత.. ఆయా సంస్థలు సుజనా చౌదరి విషయంలో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఆయా దర్యాప్తు సంస్థల్ని తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటోన్న కేంద్రం, వాటిని ప్రయోగించడం ద్వారా ఇతర పార్టీల్లోని నేతల్ని నయానో, భయానో తమ వైపుకు లాక్కుంటోంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరి సహా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి, బీజేపీలో చేరారు.
‘బీజేపీలో చేరినవారంతా పునీతులు కాలేరు.. వారిపై కేసుల వ్యవహారం వారే తేల్చుకోవాలి..’ అని బీజేపీ పైకి చెబుతున్నా, గతంలో సుజనా చౌదరి మీద జరిగిన ఐటీ సోదాలు, ఈడీ తనిఖీలు, సీబీఐ విచారణలు.. ఇప్పుడెందుకు సద్దుమణిగాయో సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీజేపీ నేతలున్నారు.
ఇక, అవసరం తీరిపోయింది గనుక, సుజనా అండ్ టీమ్ని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తూలనాడుతున్నట్లే కన్పిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్ద దిక్కుగా మారేందుకు సుజనా చౌదరి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడంలేదు. అదే సమయంలో చంద్రబాబు కోసం బీజేపీ అధిష్టానంతో ఆయన మంతనాలు కూడా జరుపుతున్నారు. అదే జీవీఎల్కి ఒళ్ళు మండేలా చేస్తోందా.? అంటే అవుననే చెప్పాలి ఆయన చేసిన తాజా వ్యాఖ్యల్ని బట్టి.