Bengaluru: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఈరోజు జరిగిన పేలుడు కలకలం రేపింది. పేలుడు ధాటికి 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ.. ‘బెంగళూరులో జరిగింది బాంబు (ఐఈడీ) పేలుడే. ఓ వ్యక్తి కేఫ్ లోకి బ్యాగ్ తీసుకుని వెళ్లడం సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. దాని వల్లే పేలుడు సంభవించింది. ఘటనపై 12.30కి సమాచారం అందింది. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశాం’.
‘ప్రాధమిక విచారణలో బాంబు (ఐఈడీ) వల్లే పేలుడు సంభవించిందని.. తక్కువ తీవ్రత ఉందని తెలిసింది. అక్కడో బ్యాగ్ లభించింది. మరింత సమాచారం కోసం క్యాషియర్ ను ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా’రని అన్నారు.
పేలుడుకు గ్యాస్ లీక్ కారణం కావొచ్చనే వార్తలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. పేలుడుపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్, ఐబీ నిపుణులు అణువణువునా తనిఖీలు చేపట్టారు.