యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో కొన్ని లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. కరోనా వైరస్ ఎప్పటికి అదుపులోకి వస్తుందో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.
మరోవైపు దీని ప్రభావంతో పలు రంగాలు తీవ్రంగా కుదేలయ్యాయి. ముఖ్యంగా విమానయానం, పర్యాటక రంగాలు కోలుకోని రీతిలో దెబ్బతిన్నాయి. ఈ సెగ ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్ ను కూడా గట్టిగానే తాకింది. ఇప్పటికే బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురికావడంతో సంక్షోభ కోరల్లో చిక్కుకున్న ఆ కంపెనీ.. కరోనా తాకిడితో మరింత విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఉద్యోగులకు స్వచ్ఛంద లేఆఫ్ (వీఎల్ఓ)ను ఆఫర్ చేసింది.
ఈ మేరకు కంపెనీ సీఈఓ డేవిడ్ కల్ హోన్ తన ఉద్యోగులకు లేఖ రాశారు. ‘‘మన టీమ్ చెక్కుచెదరకుండా ఉండేందుకు అవసరమైన ప్రతి పనీ చేశాను. కానీ ప్రస్తుతం ఒక విషయం స్పష్టంగా తేలిపోయింది. విమానయాన పరిశ్రమ ఈ సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడిన తర్వాత మన వినియోగదారుల అవసరాలు, వస్తువులు, వాణిజ్య మార్కెట్ ఇప్పడున్నట్టుగా ఉండకపోవచ్చు. రాబోయే సంవత్సరాలలో పరిశ్రమ కోలుకుంటూనే డిమాండ్, సరఫరా చైన్ తెగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాస్తవికతకు అనుగుణంగా వ్యవహరించడం ఇప్పటి నుంచే మొదలుకావాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అర్హులైన ఉద్యోగులు తగిన లబ్ధి కలిగిన ప్యాకేజ్ తో కంపెనీ విడిచి వెళ్లేందుకు స్వచ్ఛంద లేఆఫ్ ప్రణాళిక తీసుకొస్తున్నట్టు తెలిపారు. రెండు మూడు వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియజేస్తామని అందులో వివరించారు. అదే సమయంలో అవసరమైన చోట్ల బోయింగ్ లో నియామకాలు కొనసాగుతాయని వెల్లడించారు. కాగా, సంస్థలో వేలాది మంది ఉద్యోగులు ఈ స్వచ్చంద లేఆఫ్ తీసుకునే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
127530 624055Some genuinely great weblog posts on this internet internet site , regards for contribution. 89346