మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ విషయాలపై ఎప్పటికప్పుడు జనసేన పార్టీలో అంతర్గత సర్వేలు జరుగుతున్నాయి.
అలాగే, కూటమి తరఫున టీడీపీ కూడా ఎప్పటికప్పుడు మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ సర్వేలు నిర్వహిస్తూనే వుంది. మరోపక్క, అధికార వైసీపీ చేయిస్తున్న సర్వేల సంగతి సరే సరి. వీటన్నిటికీ అదనంగా, వేర్వేరు మీడియా సంస్థలూ సర్వేలు నిర్వహిస్తున్నాయి.
కాగా, జనసేన పార్టీ పోటీ చేస్తున్న మొత్తం 21 స్థానాల్లో 11 స్థానాల్లో జనసేన పార్టీ చాలా చాలా స్ట్రాంగ్గా వుందని నామినేషన్లు మొదలయ్యే రోజున వెలుగు చూసిన తాజా సర్వే ఒకటి చెబుతోంది. వీటిల్లో జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురంతోపాటు, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, పి. గన్నవరం, రాజోలు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, తెనాలి, అవనిగడ్డ నియోజకవర్గాలున్నాయి.
కాగా, నెల్లిమర్ల నియోజకవర్గం అలాగే వైజాగ్ సౌత్, యలమంచిలి, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ వున్నా, జనసేనకే ఎడ్జ్ కనిపిస్తోంది. తిరుపతి, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్గానే వున్నా, ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనిపిస్తోంది. పాలకొండ, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జనసేన ప్రస్తుతానికి ఏమంత బలంగా కనిపించడంలేదు.
అయితే, నామినేషన్ల పర్వం తర్వాత అసలు సిపలు క్యాంపెయినింగ్ షురూ అవుతుంది గనుక.. పోటీ ఇప్పుడే మరింత రసవత్తరంగా మారబోతోంది. 100 పర్సంట్ స్ట్రైక్ రేట్తో జనసేన మొత్తం 21 సీట్లూ కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే, ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తూతూ మంత్రంగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి. వైసీపీ అభ్యర్థుల ప్రచారానికి జనం నుంచి కనీసపాటి స్పందన కనిపించకపోవడంతో, వైసీపీ క్యాడర్ డీలాపడుతోందిట.
కాగా, లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే, జనసేన పార్టీ రెండు సీట్లలోనూ విజయ దుందుభి మోగిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించి కేవలం మెజార్టీ గురించిన చర్చే జరుగుతోంది.
జనసేన పార్టీకి సంబంధించి వెరీ వెరీ స్పెషల్ నియోజకవర్గంగా మారిపోతోంది నెల్లిమర్ల. ఇక్కడ వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ తొలుత అనుకున్నా, జనసేన అభ్యర్థి లోకం మాధవి, ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా వైసీపీని ఖాళీ చేయించడంలో లోకం మాధవి అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. అధికార వైసీపీకి, ఈ నియోజకవర్గ సమీకరణాలు అస్సలు అంతు పట్టకుండా పోతున్నాయ్. ఇదో సంచలన నియోజకవర్గంగా ముందు ముందు మారే అవకాశాలున్నాయి.