మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టుగా వెళ్తున్నాయి. ఎన్నికలని పురస్కరించుకొని వైసీపీ నాలుగు రోజుల క్రితమే 175 అసెంబ్లీ స్థానాలకి 24 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేసింది. కూటమి పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. జనసేన, టీడీపీ పోటీ చేస్తున్న సీట్లని కొన్ని బీజేపీ కావాలనుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.
పొత్తుల్లో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాలను కేటాయించారు. జనసేనకి 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లను ఇచ్చారు. ఇక మిగిలిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగుతోంది. తమకి కేటాయించిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడ నుంచి తంగేళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తారంటూ జనసేనాని ప్రకటించారు. సైకిల్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. బీజేపీ వైఖరి ఇందుకు కారణమట.
జనసేన, టీడీపీ లకు కేటాయించిన సీట్లలో కొన్ని తమకు కేటాయించమని కాషాయం పార్టీ అడుగుతోందట. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం పార్లమెంటు స్థానాలని బీజేపీ కి ఇవ్వాలని భావించగా వాటికి బదులుగా విశాఖపట్నం, అమలాపురం పార్లమెంటు స్థానాలను కేటాయించమని పట్టు పడుతోందట.
అదేవిధంగా టీడీపీ, జనసేనకి కేటాయించిన అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లు తమకే కావాలంటూ బీజేపీ అడుగుతుండటంతో మిగిలిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందట. అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ పార్టీ పెద్దలను కలిసి ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను కూడా అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం.
అయితే ఈ తంతు మొత్తం కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, జనసేన పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది. మరోవైపు వైసిపి అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకెళ్తుంటే.. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇది ఎన్నికల ఫలితం పై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.