Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. మార్చిలో పేలుడు తర్వాత నిందితులు అస్సాం, పశ్చిమ బెంగాల్లో దాక్కున్నట్టు నిఘా వర్గాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చారు. అయితే.. ఎన్ఐఏ రాడార్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఓ టోపీ కొనేందుకు వెళ్లి సిసీ కెమెరాకు చిక్కారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు మల్నాడు ప్రాంతవాసిగా గుర్తించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కొందరికి ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు.
వీరిని అరెస్టు చేయడంతో కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. కెఫేలో జరిగిన పేలుడు ధాటికి 9మంది గాయపడ్డారు. పేలుడులో ఆర్డీఎక్స్ వినియోగించినట్టు నిపుణులు పేర్కొన్నారు. పేలుడు సమయంలో టోపీ ధరించడం.. ఇప్పుడు మళ్లీ టోపీలు కొనుక్కోవడంతో నిందితుడిని అనేక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అరెస్టు చేశారు.