ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించుకునే విషయంలో అధికార వైఎస్సార్ సీపీ అందుబాటులో ఉన్న అన్ని వ్యూహాలనూ అమలు చేస్తోంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గురువారం సాయంత్రం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైంది.
మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్టు అంచనాకు వచ్చింది. దీంతో ప్రతివ్యూహం చేసుకునే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. నిజానికి ఆ బిల్లుల విషయంలో 14 రోజులు గడిచిపోయినందున పాస్ అయిపోయినట్టుగానే భావించొచ్చని అధికార పార్టీ తన వాదన వినిపిస్తోంది. కానీ టీడీపీ దీనిని అంగీకరించడంలేదు. మనీ బిల్లుల విషయంలోనే 14 రోజుల నిబంధన వర్తిస్తుందని, సాధారణ బిల్లుల విషయంలో నాలుగు నెలల సమయం ఉంటుందని, ఈ విషయం కూడా అధికార పార్టీకి తెలియడంలేదని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ తలనొప్పులు ఎందుకని భావించిన వైసీపీ.. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయించింది. అసెంబ్లీ ప్రోరోగ్ లో ఉన్న సమయంలో ఏ బిల్లు పై అయినా ఆర్డినెన్స్ తెచ్చుకునే వెసులుబాటు అధికార పార్టీకి ఉంటుంది. అనంతరం ఆరు నెలల లోపు దానిని సభలో ఆమోదించుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే వినియోగించుకుని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఆర్డినెన్స్ తేవాలని సర్కారు యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
అయితే, వీటిపై ఆర్డినెన్స్ తెచ్చినా.. బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించాల్సిందేనని టీడీపీ వాదిస్తోంది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు ఉంటుందని, ఆలోగా ఎప్పుడైనా ఆమోదించుకోవచ్చని వైసీపీ పేర్కొంటోంది. ఒకవేళ ఆరు నెలల కాలపరిమితి ముగిసే సమయానికి అసెంబ్లీ ప్రోరోగ్ లోనే ఉంటే, అప్పుడు మరోసారి ఆర్డినెన్స్ ను పొడిగించొచ్చు. ఇలా మండలిలో బిల్లులు ఆమోదం పొందే సంఖ్యాబలం తమకు వచ్చే వరకు ఆర్డినెన్స్ పొడిగించుకునే అవకాశమూ అధికార పార్టీకి ఉంది. ఈ విషయంలో వైసీపీ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.