ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఇంటర్ మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో విడుదల చేసిన ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలు అదరగొట్టారు. మొదటి సంవత్సరంలో 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 64 శాతం మంది, బాలురు 56 శాతం మంది పాసయ్యారు.
ఒకేషనల్ లో 49 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలి సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్ధానంలో ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా 69 శాతం, నెల్లూరు 67 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 49 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక రెండో సంవత్సర ఫలితాల్లోనూ అమ్మాయిలే టాప్ లో నిలిచారు. మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వీరిలో 75 శాతం మంది బాలికలు ఉండగా.. 68 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల్లో కృష్ణా జిల్లాయే 81 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచింది. 76 శాతంతో చిత్తూరు రెండో స్థానంలో ఉండగా.. 74 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇక్కడ కూడా 61 శాతంతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.
అయితే, పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. వీరికి మే 14 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 24లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల రీకౌంటింగ్ కు ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సారి రికార్డు స్థాయిలో కేవలం 18 రోజుల్లోనే రెండు సంవత్సరాల ఫలితాలు విడుదల చేయడం విశేషం. కాగా ప్రభుత్వం కళాశాలల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది.