లాక్ డౌన్ సమయంలో ప్రజలపై తక్కువగా ఉన్న కరోనా వైరస్ లాక్ డౌన్ ఎత్తేశాక విజృంభిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. స్థానిక బిబ్వేవాడీ-కొంద్వా రోడ్ సొసైటీ భవనానికి పూర్తిగా సీల్ చేసారు. అక్కడ రాకపోకలు లేవంటూ బారికేడ్లు కూడా పెట్టారు.
అపార్ట్ మెంట్లో మొత్తం 26 ఫ్లాట్లు ఉన్నాయి. ఓ ఫ్లాట్ లో నివసిస్తున్న తండ్రి, తల్లి, కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో పూణె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. దీంతో ఆ సొసైటీలో కలకలం రేగింది. అయితే.. మొత్తం ఫ్లాట్స్ లోని వారందరినీ కరోనా టెస్టులకు తీసుకురావాల్సిందేనని మెడికల్ ఆఫీసర్ రూపాలీ ఆర్డర్ వేశారు. దీంతో చేసేది లేక సోమవారం వచ్చి అధికారులు 40మందిని, మంగళవారం 45మందిని ఒకే ఫైర్ బ్రిగేడ్ వాహనంలో రెండు ట్రిప్పుల్లో తీసుకెళ్లారు. కానీ సోషల్ డిస్టెన్స్ మర్చిపోయారు. దీంతో ఇప్పుడు వారందరిలో టెన్షన్ మొదలైంది. ఇంట్లో ఉన్నవాళ్లని ఇలా తీసుకెళ్లడంతో లేని కరోనా వచ్చేట్టుందని వారు భయపడుతున్నారు.
దేశంలో ముందు నుంచీ మహారాష్ట్రలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అక్కడ 88,528 పాజిటివ్ కేసులుండగా.. యాక్టివ్ కేసులు 44,384గా ఉన్నాయి. 3169 మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రపై కేంద్రం ఎక్కువ ఫోకస్ చేస్తోంది.