ఇలాంటి నేరం ఇంకే రైతూ దేశంలో చెయ్యకూడదుగాక చెయ్యకూడదు. తనకున్న భూమిలో పంటలు పండించుకోవచ్చు.. పంటలు పండించుకోలేకపోతే, రియల్ ఎస్టేట్ కోసం భూముల్ని అమ్మేసుకోవచ్చు. అంతేగానీ, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇవ్వడమేంటి.? ఔను, ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు భూములు ఇవ్వడం నేరమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
నేరం చేశారు కాబట్టి, శిక్ష పడాల్సిందే. శిక్ష అనుభవిస్తున్నారు. 500 రోజులుగా అమరావతి కోసం రైతులు ఉద్యమించాల్సి వస్తే, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందినవారెవరూ స్పందించకపోవడాన్ని శిక్షగా కాకపోతే, ఇంకెలా అభివర్ణించాలి.? రైతులు, తమ భూముల్ని ఎవర్ని ఉద్ధరించడానికి ఇచ్చారు.? ఎవరి కోసం ఇచ్చారు.? అమ్మేసుకుంటే, మంచి ధర వచ్చేదే.. రాజధాని నిర్ణయంతో. కానీ, రైతులు అలా చేయలేదు. ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మారు. కానీ, ఆ ప్రభుత్వమే తమను మోసం చేస్తుందని ఆలోచించలేకపోయారు.
ఐదేళ్ళకోసారి ప్రభుత్వంలో వున్నవారు మారిపోతే, రాజధాని కూడా మారిపోతుందని పాపం వాళ్ళెవరికీ తెలియదు. అధికారంలో వున్నోడికి నచ్చినన్ని రాజధానులు, నచ్చిన చోట పెట్టుకోవచ్చని ఊహించలేకపోయారు. ఫలితం, రాజధాని అమరావతి అనాధగా మిగిలిపోయింది. ఆ అనాధ కోసం, రైతులు ఉద్యమిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా రైతులు, 500 రోజులుగా ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. లాఠీల కాఠిన్యం, కర్కశత్వం చూపించినా, రక్తం చిందించారు తప్ప ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు. బలనన్మరణాలు, మానసిక ఆవేదనతో చోటు చేసుకున్న అర్ధాంతర చావులు.. ఇలా చాలానే జరిగాయి గడచిన 500 రోజుల్లో, అమరావతి కోసం. ఇవేవీ పాలకుల్ని కదిలించలేకపోయాయి.
హైద్రాబాద్ వేదికగా ఒక్కరోజు దీక్ష చేసిన షర్మిల, తన దీక్షను పోలీసులు భగ్నం చేస్తే, తెలంగాణ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాల్ని అణచివేయలేరంటూ తెలంగాణ ప్రభుత్వంపై విజయమ్మ కూడా మండిపడిపోయారు. మరి, అమరావతి కోసం ఉద్యమించిన మహిళా రైతులు ఏమనాలి.? వారి ఆవేదన, ఓ తల్లిగా విజయమ్మను ఎందుకు కదలించలేకపోయింది.?
అమరావతికి టీడీపీనే కాదు, వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. అధికారంలోకి రాగానే వైసీపీ మాట తప్పింది. మూడు రాజధానుల పేరుతో ఏకైక రాజధాని అమరావతిని ముక్కలు చేయాలని చూస్తోంది జగన్ సర్కార్. ఓ వైపు న్యాయ పోరాటం, ఇంకో వైపు రోజువారీ నిరసనలు, ఆందోళనలు.. వెరసి, 500 రోజులుగా అమరావతి కోసం ధైర్యంగా నిలబడ్డ రైతులకు ‘సెల్యూట్’ చేసి తీరాల్సిందే.
ఒక కాకి చచ్చిపోతే, వంద కాకులు గుమికూడతాయి. కానీ, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు ప్రాణ త్యాగాలు చేస్తోంటే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలెవరూ అటువైపు చూడటంలేదు. ఔను, అమరావతి కోసం.. కాదు కాదు, రాష్ట్రం కోసం.. తమ భూముల్ని ఇవ్వడమే రైతులు చేసిన నేరం. ఆ నేరానికి శిక్ష అనుభవించాల్సిందే మరి.