ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాన్నాళ్ళ తర్వాత పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తారంటూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హడావిడిగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో ఈ ప్రాజెక్టుకి ప్రతిపాదనలు జరిగాయి. దశాబ్దాలు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవడంలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ‘జలయజ్ఞం’ పేరుతో చేసిన ధనయజ్ఞం తాలూకు పాపం ఇప్పటికీ ఆ ప్రాజెక్టుని వెంటాడుతూనే వుంది.
ప్రాజెక్టు ఆలస్యమవుతున్న కొద్దీ అంచనా వ్యయం పెరిగిపోతూనే వుంది. జాతీయ ప్రాజెక్టు అయినాగానీ, పోలవరం ప్రాజెక్టుకి మోక్షం కలగకపోవడం ఆశ్చర్యకరమే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యింది. పోలవరం ప్రాజెక్టుతో పోల్చితే, కాళేశ్వరం ఖర్చు పరంగా చాలా చాలా పెద్దది. అయినా, దాన్నొక యజ్ఞంలా భావించి పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఇక, ఇటీవల పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 11 వేల కోట్ల రూపాయల్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిన దరిమిలా, ఆ వ్యవహారాన్ని తమ సొంత పబ్లిసిటీకి వాడుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటాహుటిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు స్కెచ్ వేశారన్నది విపక్షాల ఆరోపణ.
అసలు పోలవరం ప్రాజెక్టుకి పట్టిన శాపమేంటి.? ఇంకేముంది.? రాజకీయమే.! ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడంలోనూ.. ఇళ్ళకు స్టిక్కర్లు వేయడంలోనూ చూపుతున్న శ్రద్ధలో పదోవంతు అయినా, వైసీపీ పోలవరం ప్రాజెక్టుపై చూపి వుంటే, ఈపాటికి పూర్తయ్యేదే.
నిజానికి, వైసీపీ అంతలా కష్టపడిపోవాల్సిన పనిలేదు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సరిపోతుంది. ఎందుకంటే, పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రాన్ని నిలదీసేంత ధైర్యం వైసీపీకి వుండొద్దూ.?