అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి, తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిపక్షంగా తలపడి, నిలబడ్డారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. ఆయన కష్ట ఫలించింది.. అధికార చేతికొచ్చింది. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన, ఇంకో వైపు పార్టీ అధినేతగా చక్కబెట్టాల్సిన వ్యవహారాలతో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కీలకమైన అంశాలపై మీడియా ముందుకొచ్చేందుకు వైఎస్ జగన్ మొహమాటపడాల్సి వస్తోంది. నిజానికి, ఆయన మొహం చాటేస్తున్నారని అనడం సబబేమో. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై వైఎస్ జగన్ పెదవి విప్పలేని పరిస్థితి ఏర్పడిందిప్పుడు. వైసీపీ – టీడీపీ మధ్య ‘ఆత్మకూరు’ రచ్చ చిన్నదేమీ కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది.
అయినాగానీ, వైఎస్ జగన్, తన చుట్టూ వున్న ‘కోటరీ’ని దాటి, బయటకొచ్చి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఇదే పరిస్థితి. పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంపై వైఎస్ జగన్ యూటర్న్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేపో మాపో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే పరిస్థితి రావొచ్చు. అమరావతి సంగతి సరే సరి.
ఎలా చూసినా, ఒకదాని వెంట ఇంకొకటి ఫెయిల్యూర్స్ని జగన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. నిజానికి, తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు గనుక, వైఎస్ జగన్ కొంత సమయం తీసుకుని వుండాల్సింది వివాదాస్పద నిర్ణయాల విషయంలో. ఓ ఆరు నెలలపాటు రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి, ఈలోగా సంక్షేమ పథకాల పేరుతో తమకు చెడ్డపేరు రాకుండా చూసుకోగలిగితే.. పరిస్థితి ఇంకోలా వుండేది.
చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ ఓ కోటరీ వుంటుంది. దాన్ని దాటి ఆయన బయటకు రారు. అదే ఆయన్ని ఎప్పటికప్పుడు ముంచేస్తుంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే ఫాలో అవుతున్నట్లున్నారు. చంద్రబాబు పరిస్థితి వేరు, వైఎస్ జగన్ పరిస్థితి వేరు. ముందు ముందు రాజకీయంగా వైఎస్ జగన్ మరింత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.
ప్రభుత్వంలోనే ‘నిక్కచ్చిగా మాట్లాడేవారు’ వుండడం కూడా వైఎస్ జగన్కి అవసరమే. కానీ, సొంత మీడియా కావొచ్చు.. పార్టీలో ముఖ్యమైన నేతలు కావొచ్చు.. భజన బృందంలా మారిపోవడంతోపాటుగా, వైఫల్యాల్ని కూడా గమనించలేనంతగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడ్డుపడుతున్నారు. ఇలాగైతే, రాష్ట్రంలో పాలన పడకేయడమే కాదు.. పార్టీ కూడా పడకేసేలా వుందన్నది నిర్వివాదాంశం.
