ఏప్రిల్ 1 విడుదల.! తెల్లారింది.. సామాజిక పెన్షన్లను పంచడానికి, తెలవారకుండానే వాలంటీర్లు రంగంలోకి దిగాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. కానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కదా.? వైసీపీ కార్యకర్తలెలా, సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారు.?
అదేంటీ, వాలంటీర్లకీ.. వైసీపీ కార్యకర్తలకీ తేడా వుంది కదా.! ఏదీ, ఎక్కడ.? వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో సెలవిచ్చారు. పార్టీ కోసం పని చెయ్యకపోతే వాలంటీర్లను పీకి పారేస్తామని మంత్రులూ హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని సర్టిఫై చేశారు.!
అద్గదీ అసలు సంగతి. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదు. వాళ్ళేమీ ఉద్యోగులు కారు. జస్ట్ వైసీపీ కార్యకర్తలు.. వారికి, వాలంటీర్ అనే ముసుగేసింది వైసీపీ. సో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, ప్రజాధనాన్ని ఏ చట్టబద్ధతా లేని వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ ముసుగేసుకుని, పంచడానికి వీల్లేదు.
ఇది తెలియనంత అమాయకత్వం ప్రభుత్వ పెద్దలకు లేదు కదా.! తెలిసే అంతా చేశారు. వాలంటీర్ వ్యస్థకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు.? వాళ్ళెందుకు ప్రభుత్వ ఉద్యోగులు కాలేకపోయారు.? ఇలాంటి ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానమే దొరకదు. ‘వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ..’ అని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెలవిచ్చారు.
ఇప్పుడేమో, వాలంటీర్ రాకపోవడంతో తమకు పెన్షన్లు అందలేదంటూ అవ్వాతాతలతో వీడియోలు చేయిస్తోంది వైసీపీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేవలేని స్థితిలో వున్న వృద్ధులు, పెన్షన్ల కోసం తల్లడిల్లుతోంటే, చూడ్డానికి ఎవరికైనా బాధగానే వుంటుంది. కానీ, దీనికి బాధ్యత ఎవరు వహించాలి.?
చట్టబద్ధత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు పంచలేకపోతున్నారు.? ఆ ప్రభుత్వ వ్యవస్థని నిర్వీర్యం చేసి, సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ఎందుకు తీసుకొచ్చింది.? ఇదిగో, ఇప్పుడిలా ఎన్నికల ముందర అవ్వాతాతల్ని ఏడిపించి, సింపతీ కొట్టెయ్యడానికి.
చంద్రబాబు పెన్షన్లను ఇవ్వనీయలేదు.. పవన్ కళ్యాణ్ పెన్షన్లు ఇవ్వనీయడంలేదు.. అంటూ వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు వెళ్ళి, లబ్దిదారుల దగ్గర దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళెలా ఆపుతారు.? ఇది ప్రభుత్వ ధనం కదా.. అంటే, ప్రజాధనం కదా.? అని కొందరు లబ్దిదారులు, వాలంటీర్లను నిలదీస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.
అసలు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకి జగన్, వైఎస్సార్ పేర్లెందుకు పెట్టారు.? అలాంటి ఏ పేర్లూ ఇకపై వుండకూడదు.. అసలు వాలంటీర్ వ్యవస్థే వుండకూడదు.. ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు తెచ్చి ఇవ్వాలి.. లేదంటే, మేమే వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్షన్లు తెచ్చుకుంటాం.. అని జనం అంటున్న పరిస్థితీ కనిపిస్తోంది.
గ్రౌండ్ రియాల్టీ.. వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది. కానీ, వైసీపీ అనుకుల మీడియాలో.. బోల్డంత దుష్ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, మూడో తేదీనే పెన్షన్లు.. అని సాక్షి పత్రికలో గతంలోనే రాశారు. అలాంటప్పుడు, ఏప్రిల్ 1వ తేదీన ఎందుకింత రచ్చ.? ఆల్ ఫూల్స్ డే రోజున.. వాలంటీర్లని వైసీపీ ఫూల్స్ని చేసినట్లుంది.!
సెల్ఫ్ గోల్ అంటాం కదా.. అదే ఇది.! వాలంటీర్ లాంటి సమాంతర వ్యవస్థలు సమాజానికి ఎంత చేటు.? అన్న విషయం.. ఇదిగో, ఇలా నిరూపితమవుతోందన్నమాట.