ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్కి వైసీపీ కుదేలవనుందా.?
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభావాన్ని వైసీపీ మాత్రమే కాదు, కూటమి కూడా ముందుగా అంత సీరియస్గా తీసుకోలేదు. వాస్తవానికి, కూటమి మీద వైఎస్ షర్మిల తరఫున నెగెటివ్ ఇంపాక్ట్ కూడా పెద్దగా వుండే అవకాశమూ లేదని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడ్డారు.
అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు షర్మిల వల్ల చీలుతుందనే విశ్లేషణలు తొలుత వినిపించాయి. ఈ కోణంలోనే వైఎస్ జగన్, తన సోదరి షర్మిలని వ్యూహాత్మకంగా రంగంలోకి దించారన్న అనుమానాలు అప్పుడూ వ్యక్తమయ్యాయి.. ఇప్పటికీ అనుమానాలు అలాగే వున్నాయి.
అయితే, వైఎస్ విజయమ్మ విడుదల చేసిన వీడియో తర్వాత కొంత ఈక్వేషన్ మారింది. ప్రధానంగా కడప లోక్ సభ పరిధిలో, వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా, పోలింగ్ సరళిని చూసిన కొందరు అభిప్రాయపడుతున్నారు.
పులివెందులలోనూ క్రాస్ ఓటింగ్ గట్టిగానే జరిగిందట. అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీకి ఓటేసిన ఓటర్లు, లోక్ సభ నియోజకవర్గం విషయానికొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారట. ప్రధానంగా మహిళలు, దళితులు, మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పడ్డాయని అంటున్నారు.
వాస్తవానికి, ఇది కూటమి అభ్యర్థికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం వుంది. కానీ, షర్మిల లక్షన్నర ఓట్లను కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రాబట్టగలిగితే, కూటమికి అది మేలు చేసే అవకాశం వుంటుందనేది ఓ వాదన.
కాదు కాదు, షర్మిల వ్యవహారమెలా వున్నా, ఓటింగ్ వైసీపీకి వ్యతిరేకంగానే జరిగిందన్నది ఇంకో అంచనా. వైసీపీలోనూ ఈ విషయమై ఆందోళన కనిపిస్తోందంటే, అవినాష్ ఓటమి దాదాపు ఖాయమని అనుకోవచ్చేమో.!