ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద వుంటుంది..’ అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది వైసీపీ అను‘కుల’ మీడియా.
2019 ఎన్నికల్లో వచ్చినట్లు వైసీపీకి ఈసారి 150కి పైగా సీట్లు రాకపోవచ్చుగానీ, 100 సీట్లకు ఒకటీ అరా అటూ ఇటూగా వస్తాయ్.. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అంటూ, వైసీపీ అను‘కుల’ మీడియా, తాజాగా తెరపైకి తెస్తున్న కథనాలు వైసీపీ శ్రేణులకు షాక్ ఇస్తున్నాయి.
వాస్తవానికి, వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా, నెమ్మదిగా తమ శ్రేణులకు వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పడం మొదలు పెట్టింది. ‘అధికారంలోకి ఎలాగైనా వచ్చేస్తాం..’ అని చెబుతుంటే, ‘ఔను నిజమే.. మరీ, రికార్డు స్థాయి సీట్లతో గెలవలేంగానీ, ఎలాగోలా గెలిచేస్తాం..’ అని వైసీపీ శ్రేణులు ఓ నమ్మకానికి వస్తున్నాయ్.
విశాఖలో వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారమట.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రెటరీ.. అంటూ వైసీపీ అను‘కుల’ మీడియాలో వస్తున్న కథనాల్ని వైసీపీ శ్రేణులు నమ్మడంలేదు. చిత్రమేంటంటే, వైసీపీ అను‘కుల’ మీడియాలోనే కొందరు ఈ విషయాల్ని నమ్మలేని పరిస్థితి.
వైసీపీ పట్ల జనాల్లో వ్యతిరేకత వుందని వైసీపీ అను‘కుల’ మీడియా అర్థం చేసుకోవడం గొప్ప విషయమే. కానీ, అదెంత మొత్తంలో వుంది.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. ‘తీర్పు మళ్ళీ ఏకపక్షమే అవుతుంది..’ అని నీలి కూలి మీడియాలో ఓ వర్గం, కొత్త వాదనను తెరపైకి తెస్తోంది.
కర్ర విరగకుండా, పాము చావకుండా.. అన్న చందాన కాకుండా, విషయం వైసీపీకి అర్థమయ్యేలానే నీలి, కూలి మీడియా ఆ ప్రచారాల్ని తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం. దానర్థం, క్లియర్ విక్టరీ కూటమికి దక్కుతుందనే. మరి, వైసీపీ పరిస్థితేంటి.?
నేరుగా వైసీపీ ఓటమి గురించిగానీ, కూటమి గెలుపు గురించిగానీ, ఈ వర్గం మీడియా చెప్పడంలేదు గనుక, ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు..’ అన్న చందాన టీడీపీ గెలిస్తే, ‘మేం చెప్పిందే నిజం..’ అని చెప్పుకోడానికి వీలుండేలా, ఒకవేళ తేడా కొట్టి వేవ్ టీడీపీ కూటమి వైపే వస్తే, ‘ఇదే కదా మేం చెప్పింది’ అని బుకాయించడానికి వీలుండేలా.. నీలి కూలి మీడియా ‘గ్రౌండ్ సెట్’ చేసుకుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోలేదుట. అదే, ఈ ఎన్నికల్లో వైసీపీకి మరణ శాసనం.. అన్నది ఓ బలమైన వాదనగా వుంది. ఉద్యోగుల ప్రభావం, సామాన్య ఓటర్లపై ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏ నియోజకవర్గంలో అయినాసరే, ‘వైసీపీ గెలిచే అవకాశమే లేదు, గెలవకూడదు..’ అని జనం బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. వైసీపీకి ఓటేసినవాళ్ళు కూడా, ‘మేం వైసీపీకే ఓటేశాం..’ అని చెప్పుకోవడానికి ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోంది.
ఇదంతా వైసీపీ పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతకు నిదర్శనం. ఇంతకీ, వ్యతిరేకత ఎంత.? అంతకు మించి.! ఔను, నిజంగానే ‘అంతకు మించి’.!