ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ ఈవీఎం పగలగొట్టారు.
వైసీపీ ఎమ్మెల్యే పగలగొట్టిన ఈవీఎం వ్యవహారం.. వీడియో రూపంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ రిగ్గింగ్కి పాల్పడిందనీ, ఆయా పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ చేయాలనీ వైసీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ – వైసీపీ మధ్య పరస్పర ఆరోపణల పర్వం నడుస్తోంది. టీడీపీ అరాచకాలంటూ వైసీపీ అను‘కుల’ మీడియాలో కథనాల్ని చూస్తున్నాం. వైసీపీ అరాచకాలపై టీడీపీ అను‘కుల’ మీడియాలో కథనాల సంగతి సరే సరి.
అయితే, టీడీపీ నేతల గూండాగిరీ ఓ లెక్క.. వైసీపీ ఎమ్మెల్యే, ఈవీఎం పగలగొట్టడం అనేది ఇంకో లెక్క. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి, హైడ్రామాకి తెరలేపి.. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి, చివరికి కోర్టు నుంచి ఊరట పొందారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేవరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసు శాఖకు సూచించింది న్యాయస్థానం. పలువురు టీడీపీ నేతలపైనా ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసులకు సంబంధించిన చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.
అత్యంత దారుణమైన విషయమేంటంటే, ఈవీఎం పగలగొట్టడం నేరమే అయినా, దాన్ని వైసీపీ సమర్థించుకుంటుండడం. ఈ వ్యవహారంపై వైసీపీ మరింతగా ప్రజల్లో చులకనైపోతోంది. టీడీపీ రౌడీయిజం గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం సంగతెలా వున్నా, వైసీపీనే ఈవీఎం ధ్వంసం కేసులో నవ్వులపాలవుతుండడం గమనార్హం.
ఎన్నికల కౌంటింగ్ తర్వాత.. కొత్త ప్రభుత్వంలో ఈ కేసులు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాల్సిందే. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీపై వేధింపులు మామూలే.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ లెక్క వేరే లెవల్లో వుంటుంది.