రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు చేయగలమన్నది వైసీపీ ధీమాగా కనిపిస్తోంది.
నిజానికి, రాయలసీమలో వైసీపీ ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే, మునుపటి వేవ్ అయితే రాయలసీమలో వైసీపీకి వుండకపోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ సొంత నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు.
దాంతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులోని ఇతర నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టలేకపోయారు. కుప్పం నియోజకవర్గాన్ని తీసుకుంటే, పెద్దిరెడ్డి అన్నీ తానే అయి, వైసీపీ అబ్యర్థి భరత్ గెలుపు కోసం ప్రయత్నించి వుండాలి. కానీ, భరత్ ఇక్కడ ఏకాకి అయిపోయారు. టీడీపీ అనూహ్యంగా పుంజుకుని, చంద్రబాబుకి ఈసారి మంచి మెజార్టీ కుప్పంలో వచ్చేలా వుంది.
ఇక, చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డికి కంచుకోట అయినా, అక్కడా పరిస్థితులు మారాయి. తిరుపతిలో కూడా పరిస్థితులు వైసీపీకి ఏమంత అనుకూలంగా కనిపించడంలేదు. చిత్తూరు జిల్లా పరిస్థితి ఇలా వుంటే, కడపలోనూ కొంత ఎదురీత వైసీపీకి తప్పేలా లేదు. కడప జిల్లాలో అయితే, వైఎస్ షర్మిల చీల్చే ఓట్లు వైసీపీకి శాపంగా మారనున్నాయి.
అనంతపురం జిల్లాలో టీడీపీ ఒకింత బాగానే పుంజుకుంది. కర్నూలు జిల్లాలో మళ్ళీ వైసీపీకే ఎడ్జ్ వుండొచ్చు. అయితే, వైసీపీ హీరో.. కూటమి జీరో అనే పరిస్థితి ఎక్కడా లేదు. కొన్ని చోట్ల టఫ్ ఫైట్, కూటమికి కలిసొచ్చే అవకాశం వుంది. ఒకవేళ వేవ్ గనుక, కూటమికి అనుకూలంగా వుంటే, రాయలసీమలోనే వైసీపీకి చావు దెబ్బ తప్పకపోవచ్చు.
ఎంత చావు దెబ్బ అయినా, సీమలో సగం సీట్లు వైసీపీకి దక్కొచ్చన్నది ఓ అంచనా. సీమలో వైసీపీ ఎంత బలంగా వుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.