ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారా.? లేదా.? అన్నది ఆ రోజు తేలుతుంది. వైసీపీ ఓడిపోతే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు వైఎస్ జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఎన్నికల ఫలితాల అనంతరం, చీఫ్ సెక్రెటరీ.. కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. అది కూడా, గెలిచిన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి తాలూకు అభిప్రాయం తీసుకున్నాకే ఏర్పాట్లు జరుగుతాయి.
కానీ, అప్పుడే.. విశాఖ కేంద్రంగా కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన పదవీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. అంటూ వైసీపీ అను‘కుల’ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. చీఫ్ సెక్రెటరీ ఇప్పటికే, విశాఖలో పర్యటించి, కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారనేది ఆ కథనాల సారాంశం.
వాస్తవానికి, కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి చీఫ్ సెక్రెటరీ ప్రస్తుతానికి ఎలాంటి ఏర్పాట్లూ చేయలేరు. ఆ అవకాశమే లేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి గనుక అధికారంలోకి వస్తే, కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం అమరావతిలోనే జరుగుతుంది.
ఇప్పటి చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత సన్నహితుడైనా, జవహర్ రెడ్డి ఇష్టానుసారం ఏదీ జరగదు. ఆయనైనా పద్ధతి ప్రకారం వ్యవహరించి తీరాల్సిందే.
ఇదంతా, సోకాల్డ్ వైసీపీ అను‘కుల’ మీడియాకి తెలియదా.? అంటే, తెలియదని అనుకోలేం. వైసీపీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికో, స్వామిభక్తి చాటుకునేందుకో.. వైసీపీ అను‘కుల’ మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయంతే.
వైసీపీ ముఖ్య నేతలు, విశాఖలోని ప్రముఖ హోటళ్ళని బుక్ చేసుకుంటే, అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవరూ కాదనరు. విశాఖలోనే వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెప్పుకోవచ్చగాక. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. వైసీపీ సానుభూతిపరుడిగా జవహర్ రెడ్డిని వైసీపీ శ్రేణులు చూస్తే, అది వాళ్ళ ఇష్టం.
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజుతో అన్నీ మారిపోతాయ్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలుపుపై స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో, జవహర్ రెడ్డి, తన పదవిని పణంగా పెట్టి, ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి ‘జగన్’ కోణంలో ఏర్పాట్లు చేయిస్తారని అనుకోలేం.
అయితే, ఈ వైసీపీ అను‘కుల’ మీడియా కథనాల్ని చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి ఖండించి వుంటే బావుండేది. అది ఆయన గౌరవాన్ని పెంచుతుంది. కానీ, వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలూ రాజకీయ కోణంలోనే పనిచేస్తున్న దరిమిలా, సీఎస్ జవహర్ రెడ్డికీ వైసీపీ మరకలు ఇలా అంటుకున్నాయంతే.