YS Avinash Reddy: గత శనివారమే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందట. అలాగని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి శనివారం సీబీఐ యెదుట కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరు కావాలంటూ ముందస్తు బెయిల్ నిబంధనల్లో న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ముందస్తు బెయిల్ వచ్చేవరకూ, సీబీఐ విచారణకు పలు మార్లు డుమ్మా కొట్టిన అవినాశ్ రెడ్డి, ఆ ముందస్తు బెయిల్ రాగానే, సీబీఐ యెదుట విచారణకు హాజరవడమే ఆశ్చర్యకరం. ఎటూ అరెస్టయ్యే అవకాశం లేదు గనుక, ఆయన విచారణకు హాజరవుతున్నారు.
అయితే, విచారణ సందర్భంగా అవసరమైతే సీబీఐ అరెస్టు చేయొచ్చనీ, ఆ వెంటనే వ్యక్తిగత పూచీ కత్తు మీద బెయిల్ ఇవ్వాలనీ న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డిని సీబీఐ, గత శనివారం అరెస్టు చేసి.. ఆ వెంటనే ఐదు లక్షల పూచీ కత్తు మీద బెయిల్పై విడుదల చేసిందన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.
కాగా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి, జైల్లో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ‘ప్రత్యేక హోదా’ అంటూ ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కోణంలో చూస్తే, కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి కూడా సీబీఐ ప్రత్యేక హోదా కల్పించినట్లే భావించాలేమో.!
లేకపోతే, అత్యంత రహస్యంగా అరెస్టు చేసి, ఆ వెంటనే బెయిల్ ఇచ్చి.. విడుదల చేయడమేంటో.! సీబీఐ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరిగి వుండదన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
మొదటి నుంచీ అవినాశ్ రెడ్డి వ్యవహారం అనుమానాస్పదంగానే వుంది. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం వున్నా, సీబీఐ ఆయన్ని అరెస్టు చేయలేదు. సీబీఐ తనను అరెస్టు చేస్తుందన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన నానా రకాలుగా ప్రయత్నించారు.. అయినా, సీబీఐ అరెస్టు విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించింది.