Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను సంప్రదించి.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నవారు గతంలో తనను కిడ్నాప్ చేసి.. బెదిరించి.. షేర్లు బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లిఖార్జునరావుతోపాటు మరికొందరిని పేర్కొన్నారు. ఇందులో పోలీసులు, తన సంస్థలోని నలుగురు డైరక్టర్లకు లబ్ది పొందారన్నారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు సంస్థ ఎండీ రాజశేఖర్ తలసిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావుల పేర్లు నిందితులుగా చేర్చారు.
దీంతో వీరికి నోటీసులిచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) అధినేతల్లో నవీన్ యర్నేని ఒకరు. దీంతో టాలీవుడ్ (Tollywood) లో కలకలం రేగింది.