కరోనా ధాటికి విలవిలలాడని రంగం ఏదీ లేదు. ఈ మహమ్మారి వచ్చి అందరినీ కకావిలకం చేసేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వలస కూలీల వరకు అందరినీ ఇబ్బందులకు గురిచేసింది. ఇలా కరోనా కాటుకు బలైన రంగంలో మీడియా కూడా ఒకటి. ప్రకటనల లేక, ఆదాయం రాక దారుణంగా కుదేలయ్యాయి. దీంతో చాలా సంస్థల వ్యయ నియంత్రణ బాట పట్టాయి. పొమ్మనలేక పొగబెట్టిన సంస్థలు కొన్నైతే.. చిన్నిచిన్న కారణాలతో బయటకు బలవంతంగా వెళ్లేట్టు చేసిన సంస్థలు మరికొన్ని. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇటీవల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
టీవీ9 యాజమాన్యం మారిన తర్వాత ఆ ఛానల్ లో కీలక పరిణామాలు సంభవించాయి. పెద్ద మొత్తంలో జీతం ఆశచూపి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవిని, శివజ్యోతిని వీ6 నుంచి తీసుకొచ్చారు. అయితే, ఏడాది కూడా కాకముందే చిన్న కారణం చూపించి సత్తిని పంపించేశారు. కరోనా నేపథ్యంలో భారీ వేతనాలు పొందుతున్నవారిని తప్పించాలనే ఉద్దేశంతోనే బిత్తిరి సత్తి చేత రాజీనామా చేయించారనే గుసగుసలు వినిపించాయి. అలాగే సత్తితోపాటు కుమార్ అనే కీలక సబ్ ఎడటర్ ను కూడా సాగనంపినట్టు సమాచారం.
తాజాగా టీవీ9 ఔట్ పుట్ ఎడిటర్ చంద్రమౌళి, వికటకవి టీంలో కీలకమైన అవినాష్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. యాజమాన్యంతో వచ్చిన అభిప్రాయ బేధాలే వీరంతా బయటకు రావడానికి కారణమని చెబుతున్నా.. కాస్ట్ కటింగే దీని వెనుక ప్రధాన కారణమని సమాచారం. అంటే భారీ మొత్తంలో వేతనం పొందుతున్నవారి మెడపై కత్తి వేలాడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. రేటింగ్ పరంగా మిగిలిన ఛానళ్ల కంటే ఎంతో ముందున్న టీవీ9లోనే ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం.
మిగిలిన ఛానళ్లలో కూడా పై స్థాయిలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 24×7 నుంచి వెంకటకృష్ణ బయటకు వచ్చి ఏబీఎన్ లో చేరిన సంగతి తెలిసిందే. అలాగే హెచ్ ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేయగా.. టీ న్యూస్ సీఈఓ నారాయణరెడ్డి తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆదాయపరంగా చాలా ఛానళ్ల పరిస్థితి ఏమంత బాగాలేదు. ఉన్నాయా అంటే ఉన్నాయి అనే రీతిలో కొన్నింటిని అలా నడిపిస్తున్నారంతే. గతంలో అధిక వేతనం పొందే క్రమంలో సీనియర్లు ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు మారుతుండేవారు. కానీ ప్రస్తుతం కరోనా కాటుకు బయటకు వస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది సీనియర్లకు యాజమాన్యాలు ఎగ్జిట్ డోర్ చూపిస్తాయో?
79385 296475I truly prize your piece of work, Excellent post. 498830