Devi Sri Prasad: 1999లో ‘దేవి’తో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీ ప్రసాద్ పరిశ్రమలో 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలి సినిమాతోనే విజయం సాధించి వెనుతిరిగి చూడలేదు. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అగ్ర హీరోల సినిమాలు, పుష్పతో జాతీయ అవార్డు సైతం అందుకున్నారు. ఈక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా తన స్టూడియోకు రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈమేరకు తన సంతోషాన్ని పంచుకున్నారు.
‘ఇళయరాజా సర్ నాకు గురువు. సంగీతం గురించి తెలీని రోజుల్లోనే ఆయన సంగీతం అద్భుతంగా అనిపించేది. పరిక్షల సమయంలోనూ ఆయన పాటలే వినేవాడ్ని. ఆయన స్ఫూర్తితోనే సంగీత దర్శకుడిని అయ్యాను. స్టూడియో కట్టి అందులో ఆయన ఫొటో పెట్టుకున్నా. స్టూడియోకి ఇళయరాజా రావాలి.. ఆయనతో ఫొటో దిగాలనే నా కల నేడు నిజమైంది’.
‘నా గురువు మాండోలిన్ శ్రీనివాస్ గారి పుట్టినరోజునే కల నెరవేరడం మరింత సంతోషంగా ఉంది. నా జీవితంలో మరచిపోలేని క్షణాలివి. ఇళయరాజాగారికి ఎంతైనా కృతజ్ఞడిని. నన్ను ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలతోపాటు ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.