తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu)తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan)అత్యవసరంగా భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయ్యి ఇటీవలే విడుదలైన చంద్రబాబుని ఈ సందర్భంగా పవన్ పరామర్శించారు. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తు కార్యాచరణ పై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పవన్ ఆరా తీశారు.
దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు పార్టీల క్షేత్రస్థాయి పనితీరుపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబుపై వరుస కేసులు, ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల, క్షేత్రస్థాయి పోరాట అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవిష్యత్తులో బీజేపీ తో కలిసి ఎలా ముందుకెళ్లాలన్న ప్రస్తావన కూడా ఈ భేటీలో వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తోపాటు మరికొందరు కీలక నేతలు పాల్గొన్నారు.