భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జి.ఎ.2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”.
శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది.
“ప్రేమకాదంట” అని మొదటి అనౌన్స్ చేసిన ఈ చిత్ర టైటిల్ ను ప్రస్తుతం “ఊర్వశివో రాక్షసివో” అని మార్చి అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. చిత్ర టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్ , అను ఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్పుల్ లవ్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక బ్యానర్ జి.ఏ.2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహా నిర్మాతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.