రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్ వార్’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్ లీడర్ హతమయ్యాడు. ఓ అపార్ట్మెంట్కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్మెంట్’కి దిగడం, ఈ క్రమంలో ఇరు వర్గాలూ కొట్లాటకు దిగడంతో, ఓ గ్యాంగ్కి చెందిన లీడర్ని మరో గ్యాంగ్ హతమార్చింది. తొలుత ఈ ఘటనకు కారణం వైఎస్సార్సీపీ.. అంటూ ప్రచారం జరిగింది. టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘వైసీపీ రౌడీయిజం’ అంటూ ప్రచారం చేశాయి.
మరోపక్క, ఈ ఘటనలో చనిపోయింది టీడీపీకి చెందిన వ్యక్తి.. అంటూ అధికార వైసీపీకి చెందిన మీడియా సంస్థ తేల్చి చెప్పింది. టీడీపీ నేతలతో మృతుడు సందీప్ సన్నిహితంగా వున్న ఫొటోల్ని వైసీపీ అధికార మీడియా వెలుగులోకి తెచ్చింది. కాగా, ఇటీవలే సందీప్ ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడనీ, ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ చనిపోతే, 6 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నాడనీ, ఈ వివాదంలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అతనికి సహాయ సహకారాలు అందించాడనీ బెజవాడలో ప్రచారం జరుగుతోంది. మరోపక్క, సందీప్ భార్యకు, వైసీపీకి చెందిన ఓ మంత్రికీ బంధుత్వం వుందనే విషయాన్ని తెరపైకి తెస్తున్నారు బెజవాడ వాసులు.
కాగా, ఈ హత్యలో ప్రత్యర్థి గ్రూప్ లీడర్ మణికంఠ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికీ బలమైన గాయాలయ్యాయి. సందీప్కి చెందినదిగా చెప్పబడ్తోన్న ఓ స్టీల్ దుకాణం కూడా వైసీపీ నేత నుంచి లీజ్కి పొందినదేనట. ప్రస్తుతం సందీప్, వైసీపీకి చెందిన ఓ యువనేత అనుచరుడిగా చెలామణీ అవుతున్నాడు. ఆ యువనేత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా, ఓటమి పాలయ్యాక.. వైసీపీలో చేరాడు. ఇదిలా వుంటే, రెండు గ్యాంగుల మధ్య గొడవని రెండు పార్టీల మధ్య గొడవలా చిత్రీకరించేందుకు అధికార పార్టీకి చెందిన మీడియా పడరాని పాట్లూ పడుతోంది.
ఈ గొడవతో అస్సలేమీ సంబంధం లేని జనసేనని కూడా ఇందులోకి లాగేందుకు సదరు మీడియా సంస్థ పడుతున్న పాట్లు బెజవాడ వాసుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. రౌడీ గ్యాంగ్లు.. తమ పలుకుబడి పెంచుకోవడం కోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల చుట్టూ తిరగడం మామూలే. వారి వారి ఫొటోలు పెట్టుకోవడమూ సర్వసాధారణం. మొత్తమ్మీద, తమ పోలీసింగ్ అత్యద్భుతం అని చెప్పుకుంటోన్న అధికార పార్టీ, తమ హయాంలో బెజవాడ నడిబొడ్డున.. ఇంత పెద్ద ఘటన జరిగితే, దాన్ని తమ పాలనా వైఫల్యంగా చెప్పుకోలేక.. రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందన్నమాట.