జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి.
‘నేను రెండు పడవల మీద ప్రయాణం చెయ్యలేకపోయాను. కానీ, నా తమ్ముడు అలా కాదు.. రెండు పడవల మీద ప్రయాణం సమర్థవంతంగా చేయగలడు..’ అంటూ, సినిమాల్నీ అలాగే రాజకీయాల్ని బ్యాలన్స్ చేయగలడని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి గతంలో చిరంజీవి వ్యాఖ్యానించారు.
‘ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పని చేశారుగానీ, జనసేన పార్టీ కోసం చిరంజీవి పని చేయడంలేదు..’ అంటూ అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేందుకు చాలామంది ప్రయత్నించారు. చిరంజీవి చేయలేక కాదు, అన్నయ్యతో చేయించలేకా కాదు.. పవన్ కళ్యాణ్, ‘ప్రజారాజ్యం పార్టీ’ తాలూకు అనుభవాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
తమ్ముడి రాజకీయ వ్యూహాల్ని అన్నయ్య చిరంజీవి గౌరవిస్తూ వచ్చారు. చిరంజీవి మాత్రమే కాదు, రామ్ చరణ్ కావొచ్చు, అల్లు అరవింద్ కావొచ్చు.. ఇలా మెగా కాంపౌండ్కి చెందిన ప్రతి ఒక్కరూ, జనసేన విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తూ వచ్చారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా, ఎన్నికల ప్రచాంలో జనసేనాని బిజీగా వుండడం పట్ల, మెగా కాంపౌండ్ ఆందోళన చెందుతోంది. అవసరమైన నైతిక మద్దతు అందిస్తూనే వుంది. ఒక్క పిలుపు పవన్ కళ్యాణ్ నుంచి వస్తే, మెగా కాంపౌండ్ మొత్తం జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలోనే వుంటుంది. దీనికి నిదర్శనం, చిరంజీవి ప్రకటించిన ఐదు కోట్ల విరాళం.
అధికారంలోకి వచ్చాక సాయం చేస్తామనేవారుంటారు.. కానీ, ఏ పదవీ లేకుండానే కౌలు రైతుల కుటుంబాల్ని ఆదకుంటున్నాడు నా తమ్ముడు.. అందుకే, ఆ గొప్ప కార్యక్రమంలో నా వంతు సాయం.. అంటూ చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందించడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవి అంటేనే టైమింగ్.! అది సినిమా అయినా, రాజకీయాలైనా.. ఆయన టైమింగే వేరు.! పేర్ని నాని లాంటి కొందరు వైసీపీ నేతలు, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడ్డారు. అలాంటి వాళ్ళందరికీ, ఇప్పుడు చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలయిక చెప్పు దెబ్బ లాంటిదే.!
‘చిరంజీవి ఇచ్చింది కేవలం విరాళం కాదు.. ఇదొక స్టేట్మెంట్.. తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట అన్నయ్య చిరంజీవి వున్నాడన్నదే ఆ స్టేట్మెంట్..’ అని మెగాభిమానులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
ఇదిగో, ఈ మహత్తర ఘట్టం తెరపైకొస్తుందని తెలిసే, జనసేన నుంచి పోతిన మహేష్ని వైసీపీ తన వైపుకు తిప్పుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులనండీ, జనసైనికులనండీ.. పవన్ కళ్యాణ్ వెంట నడిచే నాయకుల్ని రాత్రికి రాత్రి పొలిటికల్ స్టార్లను చేయగలరు.. అదే సమయంలో, ఆ నాయకుల్ని రాత్రికి రాత్రి జీరోలుగానూ మార్చెయ్యగలరు.
మెగా డొనేషన్ని డైల్యూట్ చేయడానికి పావులా మారిన పోతిన మహేష్ని ఆల్రెడీ జనసైనికులు మర్చిపోయారు.! వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి విరాళం.. అన్న ప్రకటన, జనసైనికుల్లో వెయ్యేనుగుల బలాన్ని నింపింది. మీడియా మొత్తం ఇదే అంశం చుట్టూ ఫోకస్ చేయడంతో, వైసీపీ ఆడిన పోతిన మహేష్ డ్రామా.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.!