పేరుకే సడలింపు.. ప్రజా రవాణా, సినిమా హాళ్ళు యధాతథంగా లాక్డౌన్ పాటిస్తున్నాయంతే. జోన్ల పేరిట కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి, లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో గత కొద్ది రోజులుగా లాక్డౌన్ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. మరి, కరోనా భయం తగ్గిందా.? అంటే.. లేదనే సమాధానం చెప్పాలి. దేశంలో పరిస్థితులు రోజు రోజుకీ అధ్వాన్నంగా తయారవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పోల్చితే కాస్త బెటర్గా వుందంతే. రేపే ఆంధ్రప్రదేశ్ 2000 క్లబ్లో చేరబోతోంది. తెలంగాణకి ఆ క్లబ్లో చేరడానికి చాలా సమయం వుందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా అదుపు చేయలేని స్థాయికి వెళ్ళింది. తమిళనాడు, ఢిల్లీ తదితర చోట్ల కూడా ఇవే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
నిజానికి, మే 3 తర్వాత వెసులుబాట్లు కల్పించడంతో జనాలు రోడ్ల మీదకు విచ్చలవిడగా వచ్చేస్తున్నారు. దానికి తోడు మద్యం అమ్మకాల దెబ్బకి కరోనా వైరస్కి అదనపు బలం వచ్చి పడ్డట్లయ్యింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో మారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు చెబుతారు.. ఆ తర్వాత ప్రధాని కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకుంటారు. సో, కేంద్రం తదుపరి నిర్ణయం ఏంటి.? అన్న ఉత్కంఠ జనంలో కన్పించడం సహజమే.
ఇందులో ఆలోచించడానికేమీ లేదు. లాక్డౌన్ ఎత్తివేత దిశగా మరికొంత వెసులుబాటు కల్పించనుంది కేంద్రం. ఆదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజానికి, సడలింపుల ప్రక్రియ మొదలవడంతోనే లాక్డౌన్ ఎత్తివేసినట్లుగా భావించాలనే చర్చ మేధావి వర్గంలో విన్పిస్తోంది. ‘ఇన్నాళ్ళూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది..’ అన్నది ఆ మేధావి వర్గం అభిప్రాయం.
నిజమే మరి, అన్ని పనులూ మానుకుని, తమ జీవితాల్ని నాశనం చేసుకున్న జనం, ప్రభుత్వాల ఖజానా కక్కుర్తితో మద్యం షాపుల్ని తెరిస్తే ఏమనుకోవాలి.? ఇంతలా జనం త్యాగాలు చేసినా, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోయాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో ప్రజల తప్పిదాలూ వున్నా, కొందరి తప్పిదాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం.. వెరసి, దేశంలో కరోనా వ్యాప్తి ఆగకపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.