జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు.? లోక్ సభకు పోటీ చేయమని మిత్రపక్షం బీజేపీ సూచించినా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకే ఎందుకు పోటీ చేస్తున్నారు.? ఏమోగానీ, పిఠాపురం విషయమై పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన వ్యూహంతో ముందడుగు వేశారు.
లక్ష మెజార్టీకి అస్సలు తగ్గకూడదంటూ జనసేన శ్రేణుల్ని పవన్ కళ్యాణ్ సమాయత్తమయ్యారు. టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వర్మ, తొలుత గుస్సా అయినా, ఆ తర్వాత సర్దుకుపోయారు.
ఇక, కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండడం ఆసక్తికర పరిణామమే. ‘లోకల్’ అలాగే ‘మహిళా’ కార్డుని వంగా గీత తెరపైకి తెస్తున్నారు. కానీ, పిఠాపురం ప్రజానీకం పవన్ కళ్యాణ్ని స్థానికుడిగా పరిగణిస్తుండడం గమనార్హం.
ఎన్నికల ప్రచారంలో వంగా గీత బిజీగా వున్నారు. తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్, పిఠాపురం పర్యటన నుంచి కాస్త విరామం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గ్రౌండ్లో లేకపోయినా, గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం జనసేన పార్టీకే అనుకూలంగా వుంది. ఎన్నికల ప్రచారంలో వంగా గీతకు ఎక్కడికక్కడ నిలదీతలు ఎదురవుతున్నాయి.
‘ఐదేళ్ళు ఎంపీగా వుండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదనీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడానికి ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని’ వంగా గీతని పిఠాపురం ఓటర్లు నిలదీస్తుండడం గమనార్హం. ఊహించని రీతిలో ఛీత్కారాలు ఎదురవుతుండడంతో, వంగా గీత ఒకింత అయోమయానికి గురవుతున్నారట.
పిఠాపురం ప్రచారం విషయమై ఇప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వానికి వంగా గీత అప్డేట్స్ పంపిస్తున్నారు. పిఠాపురం బాధ్యతలు తీసుకున్న ముద్రగడ పద్మనాభం, మిధున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంపుతున్న నివేదికలు కూడా వైసీపీ అధినాయకత్వానికి అస్సలు మింగుడుపడ్డంలేదట.
పవన్ కళ్యాణ్ మీద వంగా గీత చేసే ప్రతి విమర్శా, వైసీపీకి పడే ఓట్ల సంఖ్యను తగ్గించేస్తుందన్న అభిప్రాయం పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో బలపడ్డంతో, ఏం చేయాలో పాలుపోవడంలేదట ఆమెకి.