Gaganyaan: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ (Gaganyaan) కు సర్వం సిద్ధమవుతోంది. యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. వారిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. అయితే.. ప్రశాంత్ తన భర్తేనని ప్రముఖ మలయాళ నటి లీనా వెల్లడించి ఆసక్తి రేపారు.
‘ప్రధాని మోదీ తొలి “ఆస్ట్రోనాట్ వింగ్స్”ను ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ కు అమర్చారు. ఇది దేశానికి, కేరళకు, వ్యక్తిగతంగా నాకు గర్వించే విషయం. ఇప్పటివరకూ రహస్యంగా ఉంచిన విషయం.. జనవరి 17న అతికొద్దిమంది మధ్య ప్రశాంత్ ను పెళ్లి చేసుకున్నా. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ విషయాన్ని చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం లేదనుకుంటున్నా’ని చెప్పుకొచ్చింది.
లీనా పోస్ట్ పై నాయర్ కుటుంబసభ్యుల నుంచి స్పందన రాలేదు. ఎయిర్ ఫోర్స్ లో ప్రశాంత్ అత్యుత్తమ ప్రతిభతో ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ పొందారు. మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు లీనా. ఆమెకిది రెండో వివాహం.