కొంతకాలం కిందట వచ్చిన ఓ తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్ కి పెళ్లయిన తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. అయితే, విడాకులు తీసుకోవడం ఇష్టం లేని సదరు హీరోయిన్ అందరి సమక్షంలో తన తాళి తీయాలంటూ కండిషన్ పెడుతుంది. అది కూడా పెళ్లి తంతులా జరగాలని ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పంచుతుంది.. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అత్తింట్లో తమ బిడ్డ పడుతున్న కష్టాలని చూడలేని ఓ తండ్రి విడాకులు ఇప్పించి ఊరేగిస్తూ మరీ పుట్టింటికి తీసుకువచ్చాడు.
ఉత్తరాఖండ్ లోని రాంచి పరిధిలో ఉన్న కైలాష్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ గుప్తా.. తన కూతురు సాక్షి గుప్తా కి సచిన్ కుమార్ అనే వ్యక్తికి పెళ్లి చేశాడు. పెళ్లయిన కొద్ది రోజులకే సాక్షికి అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా తన భర్తకి ఇదివరకే పెళ్లయిందన్న విషయం కూడా సాక్షికి తెలిసింది. అయితే, తన భర్తతోనే కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆమె విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా దాచింది. కొంతకాలం కిందట తనకి వేధింపులు ఎక్కువ అవ్వడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తన వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలనుకుంటున్నట్లు వారికి తెలిపింది.
సాక్షి నిర్ణయాన్ని స్వాగతించిన తన తల్లిదండ్రులు తనని పుట్టింటికి తీసుకురావడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక మాదిరిగా బాణ సంచాలు కాలుస్తూ.. భాజా భజంత్రీలు వాయిస్తూ ఊరేగింపుగా సాక్షిని ఇంటికి తీసుకొచ్చారు. అత్తింట్లో ఇమ్మడలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవడం తప్పుకాదని, అది దాచుకోవాల్సిన విషయం కాదంటూ సాక్షి తండ్రి ప్రేమ్ కుమార్ సదరు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. తన కూతురి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రేమ్ కుమార్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.