‘అందరికీ నమస్కారం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నో విశిష్టతలకు నిలయం.. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలకు ఎంతో సుపరిచితం.. దేశ భాషలందు తెలుగు లెస్స’ అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడారు.
‘తిరుమల బాలాజీ పవిత్ర స్థలానికి రావడం సౌభాగ్యంగా భావిస్తున్నా. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్ధిస్తున్నా. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయి. నాగార్జున కొండ, అమరావతి ప్రాంతాలు రాష్ట్రంలో ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్నాయి’ అని అన్నారు.
ఈ సందర్భంగా.. ఏపీకి చెందిన మహనీయుల్ని ప్రస్తావించిన రాష్ట్రపతి వారి సేవల్ని కీర్తించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మను సత్కరించారు.