Covid 19: దేశంలో కోవిడ్ (Covid 19) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మళ్లీ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈమేరకు పరిస్థితిపై హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. పండగ సీజన్ కూడా కావడంతో అప్రమత్తత తప్పనిసరి అని పేర్కొంది.
ఇన్ ఫ్లుయెంజా తరహా కేసులు నమోదైతై జిల్లా స్థాయిల్లోనే అరికట్టేలా పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొంది. వైరస్ కట్టడికి తీవ్రమైన చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో పెరుగుతున్న కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవే కేసులు ప్రపంచంలోని 38 దేశాల్లో వెలుగు చూస్తున్నట్టు పేర్కొంది. డబ్ల్యూహెచ్ ఓ సూచనలు పాటించాలని.. ఎప్పటికప్పుడు కొత్త కేసులపై అలెర్ట్ కావాలని ఆదేశించింది.
జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని.. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ చేపడుతున్న మాక్ డ్రిల్స్ లో భాగస్వామ్యం కావాలని కూడా సూచించింది.