గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులను స్థానికంగా ఉండే డెయిరీలకు కాదని ఉత్తరాది సంస్థ కు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన విజయ డైరీ పునరుద్ధరణ పేరుతో సుమారు రూ.650 కోట్ల ప్రజాధనాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి రూ. కోటి లీజుకు 99 ఏళ్ల పాటు అమూల్ కు అప్పగించారు. నిన్నమొన్నటి వరకు హెరిటే, సంగం డైరీలపై విషం చల్లిన వైసీసీ నాయకులు అమూల్ విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో శివశక్తి డైరీ పేరుతో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి రైతులను దోపిడీ చేస్తుంటే… అమూల్ పేరుతో సీఎం జగన్ పెద్ద కుట్రకు తెరతీశారు. పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలు అమూలు మోసాలను గ్రహించి దూరం పెడితే.. కమీషన్ల కోసం, తన మీద ఉన్న కేసుల మాఫీ కోసం ఆంధ్ర పాడిరైతుల భవిష్యత్తును గుజరాత్ కార్పొరేట్ కాళ్ల కింద పెట్టారు.
రాష్ట్రంలోని డైరీలు లాభాల నుంచి బోనస్ తో పాటు పశువులకు వైద్యసేవలు, తక్కువ ధరకు దాణా, మేలు జాతీ పశువుల వీర్యాన్ని పాడిరైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమకు ఊతాన్ని ఇస్తున్నాయి. అలాంటి కో- ఆపరేటివ్, ప్రైవేటు డైరీలకు జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కానీ అమూల్ డైరీకి మాత్రం అప్పనంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రూ. 6 వేల కోట్లను కట్టబెట్టింది. చిత్తూరు పునరుద్ధరణ ముసుగుతో ప్రజధనాన్ని అమూల్ కు దోచిపెడుతూ.. అందులోని కమీషన్లు సరాసరి తాడేపల్లి ప్యాలెస్ కు చేరేలా పథక రచన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల విజయ డైరీ భూమిని ఈ ప్రక్రియలో భాగంగా కాజేశారు. జపాన్, జర్మనీల నుంచి సుమారు రూ. 30 కోట్ల విలువైన డైరీ సామాగ్రిని తెప్పించారు. వీటిని కూడా అమూల్ పరం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పటి నుంచో పాడి రైతులకు అండగా నిలుస్తున్న ఇతర డైరీలను నిర్వీర్యం చేసే దిశగా జగన్ రెడ్డి ఈ గుజరాత్ కంపెనీకు దోచిపెడుతున్నారు.
అన్నీ తామై అమూల్ కు అండగా…
ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని అనే పాల ఉత్పత్తి సంస్థ రవాణా ఖర్చులతో కలిపి లీటరు రూ.57.25 చొప్పున పాలను సరఫరా చేస్తుండగా.. అమూల్ కు మాత్రం రవాణా ఖర్చులను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం వైసీపీ, అమూల్ సంస్థకు మధ్య ఉన్న లాలూచీ ఒప్పందాలు అర్థం అవుతున్నాయి. ఈ పాల సరఫరా ఒప్పందం ప్రకారం అముూల్ పై పన్ను భారం పడకుండా తామే చెల్లిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంది. పాలపై విధించే 5% జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇలా రవాణా ఖర్చులు, పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఏడాదికి రూ.12 కోట్ల భార పడనుంది. ఇలా అమూల్ కు జగన్ రెడ్డి రూపాయికి రూపాయి దోచి పెడుతున్నారు.