CM Stalin: తమిళనాడు (Tamilnadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) జపాన్ (Japan), సింగపూర్ (Singapore) పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈక్రమంలో ఆయన జపాన్ లో ఆదివారం బుల్లెట్ రైలులో (Bullet train) ప్రయాణించడం ఆసక్తి రేపింది. ఒసాకా నగరం నుంచి రాజధాని టోక్కో వరకూ ఆయన ఈ ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుల్లెట్ రైలు ప్రయాణం అనుభవం, భారతీయులకు ఈ రైలు ఎంత అవసరం అనేది ఆయన చెప్పుకొచ్చారు.
‘ఒసాకా నుంచి టోక్యో వరకూ బుల్లెట్ రైలులో ప్రయాణించా. 500 కి.మీ ప్రయాణం రెండున్నర గంటలలోపే పూర్తయింది. వేగం, డిజైన్, నాణ్యతపరంగా ఇటువంటి రైలు భారత్ కు అవసరం. ఈ తరహా ప్రయాణం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రావాలి’ అని ఆకాంక్షిస్తూ #futureindia అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. అనంతరం ఆయన జపాన్ లోని తమిళులతో సమావేశమయ్యారు. తమిళ సంస్కృతిని చాటిచెప్పేలా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.