బీసీసీఐకి బాంబే హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీగా ఉన్న డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ కు 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను కొట్టేసింది. ఈమేరకు జీఎస్ పటేల్ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్రిచ్ లీగ్లో బీసీసీఐ డీసీహెచ్ఎల్ తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈక్రమంలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టును బరిలో నిలిచింది.
అయితే.. నిబంధనలు ఉల్లంఘన ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో డెక్కన్ చార్జర్స్ను లీగ్ నుంచి తొలగించింది. ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని మళ్లీ వేలంలో నిలిపింది. దీంతో డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ తో విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం డీసీహెచ్ఎల్ కు బీసీసీఐ 4800 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసిపుచ్చి బీసీసీఐకి ఊరట కల్పించింది.