ఇటివల తాను నర్సులపై చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటివల నిర్వహించిన ఓ టీవీ షోలో నర్సులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘అందరికీ నమస్కారం.. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రేయింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే సోదరీమణులంటే నాకు గౌరవం. వారికెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాన’ని అన్నారు.