ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను ఓ వ్యక్తి చెంప దెబ్బ కొట్టడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటివల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్సాపూర్ గ్రామంలో వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పాల్ హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు. ఈక్రమంలో సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు కేఏ పాల్ ను అడ్డుకున్నారు.
దీంతో తననెందుకు అడ్డుకున్నారని పోలీసులతో పాల్ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కేఏ పాల్ ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో అక్కడే ఉన్న పాల్ అనుచరులు, పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లిపోయారు. దీంతో తనపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని పాల్ డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కుట్ర పన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో తనను అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం పోలీసులు పాల్ ను హైదరాబాద్ కు పంపించారు.